చంద్రబాబుపై తెలంగాణ లాయర్ల ఫిర్యాదు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ అడ్వొకేట్స్ జెఏసి శనివారం బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
మహానాడు వేదికగా చంద్రబాబు ఎమ్మెల్యేలను గొర్రెలతో పోల్చారని ఫిర్యాదులో ఆరోపించారు. యాక్టు 1951 ప్రకారం ప్రజా ప్రతినిధులను అవమానపర్చిన చంద్రబాబునాయుడుపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు.
బాబుకు అంత సీన్ లేదు: గట్టు
హామీలు నెరవేర్చే సత్తా లేకనే ఏపి సిఎం చంద్రబాబునాయుడు హైదరాబాద్లో మహానాడు పెట్టాడని టిఆర్ఎస్ నేత గట్టు రామచంద్రరావు ఎద్దేవా చేశారు. తెలంగాణ సిఎం కెసిఆర్ను ఖబడ్దార్ అనేంత సీన్ చంద్రబాబుకు ఉందా? అని ఆయన ప్రశ్నించారు.
చంద్రబాబు కన్నతల్లి కాంగ్రెస్ పార్టీ అని, చంద్రబాబులో ఎన్టీఆర్కు ఉన్న లక్షణాలు ఒక్కటి లేవని విమర్శించారు. టిడిపిలో మిగిలింది ఒక్కరో ఇద్దరో కార్యకర్తలని అన్నారు.
ఏపీలో చంద్రబాబు అరాచకవాదిగా మారాడని, రాజకీయాల్లో చంద్రబాబు లాంటి అరాచకవాది ఉండొద్దని ఎన్టీఆర్ ఆనాడు ఆశించాడని అన్నారు. తెలంగాణలో ప్రతీ రైతుకు రుణమాఫీ జరిగిందని... ఆంధ్రాలో మాత్రం అలా జరగలేదన్నారు.