పవన్ కళ్యాణ్ ట్విస్ట్: తిరుపతిలో హఠాత్తుగా సభ, ఏం చెప్తారు? జగన్తో ఎలా?
విజయవాడ: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన సమయాన్ని పూర్తిగా లేదా ఎక్కువగా రాజకీయాలకు కేటాయించనున్నారా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. శనివారం సాయంత్రం తిరుపతిలో జనసేన ప్రస్థానం పేరిట బహిరంగ సభ జరగనుంది.
ఫ్యాన్ హత్య, పవన్ ఉద్వేగం: చిరు బాటలో.. సభ వెనుక!
జనసేన సభ కోసం పవన్ కళ్యాణ్ కోటరీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ సభలో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రసంగించనున్నారు. ఆయన రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితుల పైన స్పందించే అవకాశముందని తెలుస్తోంది. హఠాత్తుగా పవన్ కళ్యాణ్ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తుండటం గమనార్హం. ఇది చర్చనీయంగా మారింది.
నిన్నటి నుంచి తిరుపతిలోనే పవన్ కళ్యాణ్
పార్టీ వ్యవహారాల పైన పవన్ పలువురితో చర్చించారని తెలుస్తోంది. ఇప్పటి వరకు స్తబ్దుగా ఉన్న జనసేన రేపటి నుంచి క్రియాశీలకంగా మారనుంది. ఇందులో భాగంగా శనివారం సాయంత్రం తిరుపతిలో పార్టీ మొదటి సభను పెడుతోంది.
ఈ రోజు గెస్ట్ హౌస్కే పరిమితం
నిన్న సాధారణ భక్తుడిలా కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పవన్ దర్శించుకున్నారు. శుక్రవారం నాడు పూర్తిగా ఆయన అతిథి గృహానికే పరిమితమయ్యారు. జనసేన విషయమై ఆయన చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది.
ప్రత్యేక హోదా పైన పోరు చేస్తారా?
జనసేన పార్టీ ప్రస్థానం పేరిట శనివారం నాడు సభ జరగనుంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ రాష్ట్ర్లంలోని సమస్యల పైన చంద్రబాబును ఎంత వరకు ప్రశ్నిస్తారు, అలాగే కేంద్రం ఇచ్చిన హామీల పైన ప్రధాని మోడీని ఏ మేరకు నిలదీస్తారనే చర్చ సాగుతోంది.
పవన్ సభతో లెక్కలు
పవన్ కళ్యాణ్ బహిరంగ సభ పెట్టాలని, జనసేన పార్టీ ప్రస్థానం ఇక ప్రారంభించాలని నిర్ణయించినట్లుగా వార్తలు వెలువడిన నేపథ్యంలో ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్తో నష్టం ఎవరికి, లాభం ఎవరికి, ప్రజా సమస్యల పైన జగన్కు మద్దతుగా నిలబడతారా అనే చర్చ సాగుతోంది. ప్రజా సమస్యలు, కేంద్రం హామీల పైన తమతో కలవాలని వైసిపి ఎప్పటి నుంచో చెబుతోంది.
ఏం సభ అనే చర్చ
ఈ సభ రాజకీయపరమైనదా లేక అభిమానులను ఉద్దేశించి మాట్లాడేందుకా అనే చర్చ సాగుతోంది. బహిరంగ సభకు ఏర్పాటు చేస్తున్న ఇందిరా మైదానం వేదిక కేవలం ఏడెనిమిది వేల మంది పట్టేలా ఉంది. ఈ నేపథ్యంలో రాజకీయ సభనా లేక అభిమానులను ఉద్దేశించి మాట్లాడే సభనా అనే చర్చ సాగుతోంది.
పవన్ కళ్యాణ్ సభకు అనుమతి కోరిన జనసేన
శనివారం నాడు నిర్వహించనున్న పవన్ కళ్యాణ్ సభకు జనసేన తిరుపతి నగర పాలక సంస్థ అనుమతి కోరింది. రేపు మధ్యాహ్నం తిరుపతిలో పవన్ బహిరంగ సభ నిర్వహిస్తారని పార్టీ కోశాధికారి రాఘవయ్య చెప్పారు. అభిమానులకు, జనసేన కార్యకర్తలకు పవన్ దిశానిర్దేశనం చేస్తారన్నారు. అజెండాపై వివరాలు వెల్లడిస్తామన్నారు.