మమతా బెనర్జీకి ఆలుగడ్డ తెచ్చిన తిప్పలు, ప్రధాని మోడీతో బేరం!
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో ఆలుగడ్డ అధికంగా దిగుబడి వచ్చింది. ఇది ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి చిక్కులు తెచ్చింది! మమత మొదటి నుండి ప్రధాని నరేంద్ర మోడీకి, బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న విషయం తెలిసిందే. బెంగాల్లో తృణమూల్, బీజేపీలో సై అంటే సై అంటున్నాయి. అయితే, ఆలు అధిగ దిగుబడి కారణంగా మమత ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది!
ఆలూ ఉత్పత్తి బెంగాల్లో విపరీతంగా పెరిగిపోయింది. దీంతో రాష్ట్ర మార్కెట్లో దాని ధర రూ.3కు పడిపోయింది. మరోవైపు బ్యాంకు రుణ భారంతో రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. దీనిపై విపక్షాలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నాయి. తృణమూల్ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి.
ఈ నేపథఅయంలో మమతా బెనర్జీ పలు ఇతర రాష్ట్రాలకు తమ రాష్ట్రంలోని ఆలుగడ్డను కొనాలని లేఖలు రాశారు. అయితే, ఎవరి నుండి కూడా స్పందన లభించలేదు. దీంతో ఎటూపాలుపోని పరిస్థితుల్లో మమతా బెనర్జీ కేంద్రం వైపు తన దృష్టిని మరల్చారు.
రైతు రుణాలను మాఫీ చేయాల్సిందిగా బ్యాంకులను ఒప్పించాలని ఆమె కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీకి లేఖ రాశారు. మధ్యాహ్న భోజనం వంటి కేంద్ర ప్రభుత్వ పథకాలకు అవసరమైన ఆలుగడ్డలను తమ రాష్ట్రం నుండి కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. కాగా, ఆలూ కొనుగోలు అంశంపై ప్రధాని మోడీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించవచ్చునని అంటున్నారు.