ఘోరం: రాహుల్గాంధీ కోసం పొలాలు ధ్వంసం చేశారు
బెంగళూరు: ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పాల్గొనే బహిరంగ సభ కోసం పంట పొలాలను నాశనం చేసి, చదును చేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది కర్నాటక రాష్ట్రంలో కొత్త వివాదానికి తెరలేపింది.
సెంట్రల్ కర్ణాటకలోని రాణిబెన్నూరు గ్రామం సమీపంలో నాలుగు ఎకరాల మొక్కజొన్న తోటను రాహుల్ గాంధీ శనివారం నాటి సభ కోసం నాశనం చేశారు. ఈ విషయంపై పలువురు మండిపడుతున్నారు.
రాహుల్ గాంధీ వచ్చి పోయేందుకు ఓ పేద రైతు తన విలువైన పంటను కోల్పోవాల్సి వచ్చిందని ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ తన సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు.
చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలను పరామర్శించేందుకు పర్యటిస్తున్న సమయంలో... ఈ సంఘటన దురదృష్టకరమంటున్నారు. ఈ పొలంలోని పంట మరో 15 రోజుల్లో కోతకు రానుందని, దాన్ని నాశనం చేశారని విమర్శించారు.
కాగా, ఈ ప్రాంతానికి హెలికాప్టర్ల వచ్చే రాహుల్ గాంధీ.. తొమ్మిది కిలో మీటర్లు పాదయాత్ర చేయనున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన వెళ్లే దారిని క్లియర్ చేశారు. ఆయనకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చేయాలని స్థానిక నేతలు భావించారు.