మోడీ సరికొత్త ప్రచారం.. 'స్మైల్ ప్లీజ్'
వినూత్న రీతిలో ప్రచారాల్ని పరుగులు పెట్టించడంలో ప్రధాని నరేంద్ర మోడీ దిట్ట. పథకాలను ప్రవేశపెట్టడమే కాదు, ఆయా పథకాలను జనంలోకి తీసుకెళ్ళే క్రమంలో.. సొంత ఇమేజ్ ని పెంచుకోవడం పట్ల కూడా ఆయన శ్రద్ద చూపుతారు. తద్వారా అటు ప్రభుత్వ పథకాలతో పాటు ఇటు వ్యక్తిగత ప్రాబల్యాన్ని పెంచుకోవడం మోడీ ముఖ్య ఉద్దేశ్యం అయి ఉండొచ్చు. తాజాగా మరోసారి ఇదే పంథాలో నడవబోతున్నారాయన.
మే నెలాఖరు నాటికి కేంద్రంలో అధికారంలోకి వచ్చి రెండేళ్ళు పూర్తవుతున్న సందర్భంగా.. కమలనాథులు తమ తమ నియోజకవర్గాల్లో భారీ బహిరంగ సభలకు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇందులో భాగంగా రెండేళ్ళ కాలంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలకు భారీ ఎత్తున ప్రచారం కల్పించాలని యోచిస్తోంది బీజేపీ నాయకత్వం. ఈ ప్రచార కార్యక్రమాల కోసం 'స్మైల్ ప్లీజ్' అనే ట్యాగ్ లైన్ ని కూడా సిద్ధం చేశారు.
ఆకాశవాణి, దూరదర్శన్ ద్వారా ఈ ప్రచార కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేయాలని భావిస్తున్నారు. ముఖ్యంగా 'దీనదయాళ్ గ్రామ జ్యోతి యోజన' ఎల్ పీజీ 'గివ్ ఇట్ అప్' 'పంటల బీమా పథకం' 'డిజిటల్ ఇండియా' 'స్వచ్ఛ భారత్' వంటి పథకాల ద్వారా బీజేపీ సాధించిన పురోగతి గురించి ప్రచార కార్యక్రమాలల్లో వివరించనున్నట్టుగా తెలుస్తోంది. ఇందుకోసం బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలందరు తమ తమ నియోజకవర్గాల్లో ప్రచార కార్యక్రమాల కోసం ఏర్పాట్లు చేసుకోవాలని నిర్ణయించినట్టగా సమాచారం. మొత్తానికి 'స్మైల్ ప్లీజ్' తో మరోమారు తన ప్రచార మార్క్ ని చాటుకోబుతున్నారు ప్రధాని నరేంద్ర మోడీ .