యూపీలో సవాళ్లు: దటీజ్.. యోగి ఆదిత్యనాథ్, బీజేపీయే మోకరిల్లింది!
ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిథ్యనాథ్ ముఖ్యమంత్రిగా ఈ రోజు (ఆదివారం) ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. యూపీ జనాభా 20 కోట్లు. బ్రెజిల్తో సమానం. ఆర్థిక వ్యవస్థ ఖతార్తో సమానం.
లక్నో: ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిథ్యనాథ్ ముఖ్యమంత్రిగా ఈ రోజు (ఆదివారం) ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. యూపీ జనాభా 20 కోట్లు. బ్రెజిల్తో సమానం. ఆర్థిక వ్యవస్థ ఖతార్తో సమానం. స్థూల జాతీయోత్పత్తి కెన్యాతో సమానం.
ఇక పేదరికం విషయానికి వస్తే ఆఫ్రికాలోని అత్యంత దుర్భర దారిద్య్రం అనుభవిస్తున్న దేశాలను కూడా వెనక్కి నెట్టివేస్తుంది. బీజేపీ విజయోత్సవ వేడుకులు జరుపుకుంటున్న సమయంలో.. కమలనాథులకు యూపీలో సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి.
మ్యాథ్స్ గ్రాడ్యుయేట్ నుంచి సన్యాసి.. యూపీ సీఎం
యోగి ఆదిత్యనాథ్ ఆదివారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ సహా పలువురు బీజేపీ ప్రముఖులు హాజరు కానున్నారు. ఆదిత్యనాథ్ గణితశాస్త్రంలో గ్రాడ్యుయేట్. ఆ తర్వాత సన్యాసిగా మారారు.
అవే ప్రచారాన్ని తెచ్చాయి.
యోగి ఆదిత్యనాథ్ వివాదాస్పద వ్యాఖ్యలకు మారు పేరు. గోరఖ్పూర్ నుంచి అయిదుసార్లు ఎన్నికైన ఎంపీగానే కాకుండా ఆ విధంగానూ ఆయనకు పేరొచ్చింది. లవ్ జిహాదీకి వ్యతిరేకంగా ఆయన చేసిన వ్యాఖ్యలు, మత మార్పిడిలపై విరుచుకుపడుతూ చెప్పిన మాటలు చర్చనీయాంశమయ్యాయి. ఆయన మాటలే యోగి ఆదిత్యనాథ్కు దేశవ్యాప్తంగా ప్రచారాన్ని తెచ్చాయి.
మోడీ తర్వాత ఆయనే.. అసలు పేరు అజయ్ సింగ్
యూపీ ఎన్నికల్లో ప్రచారం కోసం ప్రధాని నరేంద్ర మోడీ తర్వాత పార్టీ నేతలు ఎక్కువగా కోరుకున్నది ఆదిత్యనాథ్నే. అలాంటి ఎంపీని బీజేపీ అధిష్ఠానం ఏరికోరి యూపీకి ముఖ్యమంత్రిగా పంపిస్తోంది. ఆయన అసలు పేరు అజయ్ సింగ్. అజయ్ భిస్త్ అని కూడా పిలుస్తారు. తూర్పు ప్రాంత స్వర్ణ దేవాలయంగా ప్రసిద్ధి చెందిన గోరఖ్నాథ్ ఆలయ ప్రస్తుత అధిపతి ఆయన.
ఆ తర్వాత యోగి..
సన్యాసం తీసుకున్న తర్వాత యోగి ఆదిత్యనాథ్గా మారారు. బీఎస్సీ చదివారు. తన ప్రసంగాలతో ప్రజల్ని ఉర్రూతలూగించడంలో మహా దిట్ట. వాటిలో ఉద్రేకపూరిత మాటలు తక్కువేం కాదు. హిందుత్వకు సంబంధించినవే కాకుండా పేదలతో ముడిపడిన అనేకాంశాలను పార్లమెంటులో లేవనెత్తేవారు.
ఉత్తరాఖండ్లో..
యోగి ఆదిత్యనాథ్ 1972 జూన్ 5న ప్రస్తుత ఉత్తరాఖండ్లోని పౌరిగడ్వాల్ జిల్లాలోని పాంచుర్లో రాజ్పుట్ కుటుంబంలో జన్మించారు. ఈతలో, బ్యాడ్మింటన్లో ప్రావీణ్యం ఉంది. 1998లో తొలిసారిగా గోరఖ్పూర్ నుంచి ఎన్నికైనప్పుడు పార్లమెంటులో అతిపిన్న వయస్కుడు (26) ఆయనే. అదే నియోజకవర్గం నుంచి అయిదుసార్లు (1998, 1999, 2004, 2009, 2014) ఎన్నికయ్యారు. ప్రతిసారీ ప్రత్యర్థిపై ఓట్ల ఆధిక్యం పెరిగిపోతూ వస్తోంది. గత ఎన్నికల్లో 1.42 లక్షల తేడాతో నెగ్గారు.
గురువుకు వారసుడిగా..
అయోధ్యలో వివాదాస్పద స్థలంలో రామమందిరం నిర్మించాలని గట్టిగా చెప్పేవారు. ఆధ్యాత్మిక గురువైన మహంత్ అవైద్యనాథ్ వారసుడిగా హిందూ గళమెత్తారు. కాషాయధారి అయిన ఆయన్ని కొందరు బాబా అని సంబోధిస్తారు. గోరఖ్పూర్లోని అలీ నగర్ను ఆయన ఆర్య నగర్గా, ఉర్దూ బజార్ను హిందీ బజార్గా పేర్లు మార్చేశారు. ఆయన పైన ఎన్నో కేసులు ఉన్నాయి. జైలుకు వెళ్లిన సందర్భాలూ ఉన్నాయి.
ఎటావాలో..
హిందూ యువ వాహిని అనే సామాజిక, సాంస్కృతిక సంస్థకు ఆయన వ్యవస్థాపకులు. ఈ సంస్థ తరఫున చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్నారనే విమర్శల్ని ఆయన ప్రత్యర్థులు తరచూ చేస్తుంటారు. చట్టాన్ని కాపాడాల్సి సంస్థలు చేతులెత్తేస్తే సామాన్య ప్రజలు న్యాయం కోసం ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాల్సిందేనని కుండబద్దలుగొట్టినట్లు చెబుతారు యోగి ఆదిత్యనాథ్. క్రైస్తవ మతంలోకి వెళ్లిన 1800 మంది హిందువుల్ని పరిశుద్ధి కార్యక్రమం పేరుతో తిరిగి హిందూ మతంలోకి తీసుకువచ్చేందుకు 2005లో ఎటావాలో కార్యక్రమం చేపట్టారు.
బీజేపీతో సత్సంబంధాలు లేకున్నా..
దాదాపు పదేళ్లపాటు ఆయనకు పార్టీ అధిష్ఠానంతో సత్సంబంధాలు లేవు. అయినా హిందూ ఓటర్లపై ఆయన చూపగలిగే ప్రభావం దృష్ట్యా పార్టీ నాయకత్వం ఆయన్ని పక్కనపెట్టలేకపోయింది. బీజేపీతో ఎన్నోసార్లు విబేధించారు. తప్పనిసరిగా బీజేపీ నేతలు ఆయనతో రాజీపడతారు. గోరక్పూర్లో మూడ్రోజుల పాటు విరాట్ హిందూ సమ్మేళన్ నిర్వహించి బీజేపీకే సవాల్ విసిరారు. మహిళా రిజర్వేషన్ బిల్లును బీజేపీ సమర్థిస్తే ఆయన వ్యతిరేకించారు. హిందూ-ముస్లిం వివాహాలకు తాను వ్యతిరేకిని కాననీ, దానిలో ఎలాంటి మోసం మాత్రం ఉండకూడదని అంటారాయన.
ఆదిత్యనాథ్ పలుకుపడి తగ్గదు
యోగి ఆదిత్యనాథ్కు ఆరెస్సెస్తో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయి. యూపీలో ఎవరు అధికారంలో ఉన్న ఆదిత్యనాథ్ పలుకుబడి తగ్గదు. ములాయం సీఎంగా ఉన్నప్పుడు పెద్ద ఎత్తున శుద్ధి కార్యక్రమాలు చేపట్టారు.