తెలుగు సినీ దిగ్గజం దాసరి నారాయణ రావు కన్నుమూత
మాజీ కేంద్రమంత్రి, ప్రముఖ సినీ నటుడు దాసరి నారాయణ రావు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
హైదరాబాద్: కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ దర్శక నిర్మాత దాసరి నారాయణరావు (75) కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వారం రోజుల క్రితం కిమ్స్ ఆసుపత్రిలో చేరిన ఆయన.. మంగళవారం రాత్రి మరణించినట్లు వైద్యులు తెలిపారు.
దాసరి మృతిని వైద్యులు అధికారికంగా ప్రకటించడానికి కాస్త ముందేప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ ఆసుపత్రి బయటకు వచ్చి, ''గురువు గారు ఇక లేరు, కాసేపట్లో బాడీని ఇంటికి తీసుకెళ్తున్నాం'' అని కన్నీటి పర్యంతమై చెప్పారు.
ఆయన అన్నవాహికకు రీకన్స్ట్రక్టివ్ సర్జరీ చేశామని, ఆ తర్వాత ఆయన మూత్రపిండాలలో సమస్య ఏర్పడిందని వైద్యులు తొలుత విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో ప్రకటించారు. ఆ తరువాత మంగళవారం రాత్రి 7 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ప్రకటించారు.
బీపీలో హెచ్చుతగ్గులు, అన్నావాహికకు రంద్రాలు, దాని వల్ల ఇన్ఫెక్షన్ సోకడం తదితరాల వల్ల ఆరోగ్యం బాగా పాడయింది. ఈ ఏడాది జనవరి 19న మొదటిసారి ఆసుపత్రిలో చేరారు. మార్చి 29న డిశ్చార్జ్ అయ్యారు. ఆ తర్వాత ఒకింత ఉత్సాహంగానే కనిపించారు. మళ్లీ ఈ నెల 17న రెండోసారి ఆసుపత్రిలో చేరారు.
మూడ్రోజుల క్రితం సర్జరీ
మూడు రోజుల క్రితం దాసరికి మరోసారి సర్జరీ జరిగింది. ఇన్ఫెక్షన్ సోకిందని సమాచారం. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. అధిక రక్తపోటు ఉంది.
5 నెలల్లో రెండుసార్లు..
గడిచిన అయిదు నెలల్లో దాసరి నారాయణ రావుకు రెండుసార్లు చికిత్స జరిగింది. తొలిసారి జనవరి 19న ఆసుపత్రిలో చేరారు. అప్పుడు చికిత్స అనంతరం మార్చి 29వ తేదీన ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఆయనకు అప్పుడు గ్యాస్ట్రిక్ బెలూన్ సర్జరీ చేశారు.
ఇటీవలే 75వ పుట్టిన రోజు
ఆ తర్వాత ఈ నెల 4వ తేదీన తన 75వ పుట్టిన రోజును జరుపుకున్నారు. అంతలోనే వారం క్రితం మరోసారి పరిస్థితి బాగా లేకపోవడంతో ఆసుపత్రిలో చేరారు. మూడ్రోజుల క్రితం మరోసారి సర్జరీ చేశారని తెలుస్తోంది.
నటులు, దర్శకులు
దాసరి నారాయణ రావు ప్రముఖ దర్శకులు, నటులు. ఆయన యూపీఏ హయాంలో కేంద్రమంత్రిగా పని చేశారు. ఆ తర్వాత కొద్దికాలంగా ఆయన కాంగ్రెస్ పార్టీకి, రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.