కేజ్రీవాల్లా మారతానంటే నీ ఇష్టం: కేసీఆర్పై కేంద్రం సీరియస్, బాబుని లాగారు
న్యూఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడ మంగళవారం నాడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దీక్ష చేసి మరో కేజ్రీవాల్ కావొద్దని హితవు పలికారు.
హైకోర్టు విభజన, న్యాయాధికారుల సస్పెన్షన్ తెలంగాణలో వేడి రాజేసిన విషయం తెలిసిందే. హైకోర్టు విభజన కోసం అవసరమైతే కేసీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు జంతర్ మంతర్ వద్ద దీక్ష చేస్తారని వార్తలు వచ్చాయి. అంతేకాదు, నిజామాబాద్ ఎంపీ కవిత కూడా హెచ్చరించారు. కేసీఆర్ ఢిల్లీలో దీక్ష చేసే పరిస్థితి కల్పించవద్దని హితవు పలికారు.
జడ్జిల సస్పెన్షన్, మోడీకి సెగ: కేసీఆర్ తీవ్ర ఆగ్రహం, ఢిల్లీలో ధర్నా
దీనిపై కేంద్రమంత్రి సదానంద తీవ్రంగా స్పందించారు. కేజ్రీవాల్లా మారుతానని కేసీఆర్ ఆంటే ఆయన ఇష్టమని మండిపడ్డారు. రాష్ట్రాల నిర్ణయాల విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదని గుర్తు చేశారు. హైకోర్టు విభజన రెండు రాష్ట్రాల నిర్ణయంతో జరగాలన్నారు.
'అమరావతి' పేరుతో కుట్ర: కవిత, తెరపైకి 'విభజన'.. రేవంత్కు రివర్స్
కేసీఆర్ ఢిల్లీలో ధర్నా చేస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. కానీ ధర్నాల పేరుతో మరో కేజ్రీవాల్లా వ్యవహరించవద్దని వ్యాఖ్యానించారు. ధర్నా ఆలోచన సరికాదన్నారు. హైకోర్టు విభజన విషయంలో కేంద్రాన్ని విమర్శించడంలో అర్థం లేదని చెప్పారు.
హైకోర్టు విభజన అన్నది ముఖ్యమంత్రి, ప్రధాన న్యాయమూర్తి బాధ్యత అని చెప్పారు. వాళ్లు వాళ్లు (ఏపీ, తెలంగాణ) సంప్రదింపులు చేసుకొని నియామకాలు చేపట్టాలన్నారు. జడ్జిల నియామకానికి సంబంధించి ఓ ఇష్యూ ఉందన్నారు.
రాజుకుంటున్న వేడి: మరో ఆరుగురు న్యాయాధికారులపై వేటు
హైకోర్టు న్యాయమూర్తుల్లో ఏపీ కంటే తెలంగాణ న్యాయవాదులు తక్కువ ఉన్నారనే అంశంపై అధ్యయనం చేశామని, నివేదిక తమకు చేరిందన్నారు. పునర్విభజన చట్టం ప్రకారం ఏపీకి పదేళ్ల పాటు హక్కు ఉందని, ఈ పదేళ్లలో ఏపీ.. రాజధానితో సహా మిగిలిన సదుపాయాలు కల్పించుకోవాలన్నారు.
చంద్రబాబు నిర్ణయించుకోవాలి: దత్తాత్రేయ
దత్తాత్రేయ మాట్లాడుతూ... తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు పరిష్కరించుకోవాల్సిన సమస్యను కేంద్రానికి అంటగట్టడం సరికాదన్నారు. రాష్ట్రాల సమస్యను కేసీఆర్ కేంద్రం రోడ్డు మీదకు లాగడం ఎంత వరకు సమంజసమో ఆలోచించాలన్నారు.
కేంద్రాన్ని నిందించవద్దన్నారు. ఏ రాష్ట్రానికి సంబంధించిన హైకోర్టు ఆ రాష్ట్రంలో ఉండాలన్ారు. దీనికి అనుగుణంగా ఏపీలో ఏర్పాటు చేయాలని దత్తాత్రేయ సూచించారు. ఆరు నెలల్లోగా ఏపీ సీఎం చంద్రబాబు సరైన నిర్ణయం తీసుకోవాలన్నారు.
అంతవరకు ఏపీ హైకోర్టును హైదరాబాదులో తాత్కాలికంగా ఏర్పాటు చేసుకునే అవకాశముందని, దానికి తెలంగాణ సీఎం సహకరించాలన్నారు.
ఈ మేరకు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను గవర్నర్, ఓ చోట కూర్చోబెట్టి నిర్ణయం తీసుకునేలా ప్రభావితం చేయాలన్నారు. హైకోర్టు విభజనకు కావాల్సిన ప్రాథమిక అంశాలు పూర్తి చేసి, కేంద్రం వద్దకు రావాలన్నారు. అప్పుడు కేంద్రం లాంచనంగా పూర్తి చేస్తుందన్నారు. కాగా, సదానందను అంతకుముందు కేంద్రమంత్రి, తెలంగాణ నేత బండారు దత్తాత్రేయ కలిశారు.