'ఆత్మహత్యలు.. చైనాలో కెసిఆర్ విహారం', చిక్కడని దానంకు మర్రి చురక
హైదరాబాద్: ఓ వైపు రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ప్రభుత్వంలో చలనం లేదని, రైతు సమస్యలు వదిలేసి ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రులు విహారయాత్రకు చైనా వెళ్లారని బిజెపి నేత నాగం జనార్ధన్ రెడ్డి గురువారం మండిపడ్డారు.
ఇవి ముమ్మాటికి రైతు ఆత్మహత్యలే అన్నారు. కెసిఆర్ సొంత జిల్లాలోనే ప్రతి గ్రామంలో కూడా రైతులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు వెంటనే కరువు భత్యం చెల్లించాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం పట్టించుకోవడం లేదు: షబ్బీర్ అలీ
రైతులు పిట్టల్లా రాలిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ శాసన మండలి నేత షబ్బీర్ అలీ ధ్వజమెత్తారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు రూ.5 లక్షలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక అసెంబ్లీని ఏర్పాటు చేసి, రైతుల సమస్య పైన చర్చించారన్నారు.
సెటిలర్ల ఓట్లు తొలగిస్తున్నారు: మర్రి
జిహెచ్ఎంసి పరిధిలో ఓఠర్ల జాబితాలో అవకతవకలకు ఈసి సహకరిస్తోందని మర్రి శశిధర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈసి నిష్పక్షపాతంగా పని చేయడం లేదన్నారు. తాము సీఈసికి ఫిర్యాదు చేస్తామన్నారు. ఓటర్ల జాబితా తొలగింపు కుట్రలో అధికారులు భాగస్వామ్యం అవుతున్నారన్నారు.
ఎన్నికలకు ముందు అఖిలపక్షం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గెలుస్తామనే విశ్వాసం లేకే ఎన్నికలు వాయిదా వేస్తున్నారన్నారు. జిహెచ్ఎంసి పరిధిలో సెటిలర్ల ఓట్లను తొలగించేందుకు టిఆర్ఎస్ కుట్ర చేస్తోందన్నారు. దీనిపై పదే పదే ఈసికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. ఇళ్లు మారారనే కారణంతో 24 శాతం ఓట్లు తొలగించారన్నారు.
దానంపై శశిధర్ రెడ్డి సెటైర్
గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దానం నాగేందర్ పైన మర్రి తనదైన శైలిలో స్పందించారు. నగర సమస్యల పైన పోరాడే విషయంలో పార్టీ నేతలకు గ్రేటర్ అధ్యక్షులు చిక్కడు దొరకడు అని దానంకు చురక అంటించారు.