నెంబర్ టూ, త్రీ ఎవరూ లేరు: కెసిఆర్ వారసుడి చర్చపై హరీష్ రావు
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుపై వారసుడి ప్రచారంపై భారీ నీటి పారుదల శాఖ మంత్రి, కెసిఆర్ మేనల్లుడు హరీష్ రావు స్పందించారు. తెరాసలో నెంబర్ టూ, నెంబర్ త్రీ ఎవరూ లేరని, ఉన్నది నెంబర్ వన్ మాత్రమేనని ఆయన అన్నారు. ఓ తెలుగు మీడియా సంస్థ ప్రతినిధితో ఆయన మాట్లాడారు.
కెసిఆర్ వారసుడు అన్నయ్య కెటిఆరేనని తెరాస పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించినప్పటి నుంచి ఆ విషయంపై చర్చ సాగుతోంది. ఆ చర్చపై కెటి రామారావు కూడా స్పందించారు. తాజాగా, హరీష్ రావు తన అభిప్రాయాన్ని చెప్పారు. కెటిఆర్ బాగా పనిచేస్తున్నారని, తెరాసలో నెంబర్ వన్, త్రీ ఎవరూ లేరని అన్నారు. ఉన్నదంతా నెంబర్ వన్ మాత్రమేనని, అది సిఎం కెసిఆర్ అని ఆయన చెప్పారు.
ప్రజలు ఇష్టపడి ఓటేస్తేనే గెలుస్తున్నామని ఆయన అన్నారు. పార్టీని నమ్ముకున్నవారికి అన్యాయం చేయబోమని, అభివృద్ధిని చూసే తెరాసలో చేరుతున్నారని ఆయన వెల్లడించారు. ఆశలకో... అవసరాలకో చేరేవారిని తీసుకోమని హరీశ్రావు స్నష్టం చేశారు.
మంత్రి కెటిఆర్ తీరు బాగుందని, పార్టీకి కెటిఆర్ చాలా కృషి చేశారని హరీష్ రావు అన్నారు. హైదరాబాద్లో ఉన్నోళ్లంతా తెలంగాణ బిడ్డలేనన్నారు. మేయర్ ఒక పార్టీ... ప్రభుత్వం మరో పార్టీ అయితే కష్టమని ప్రజలు భావించారని, అందుకే టీఆర్ఎస్ను గెలిపించి తమ బాధ్యతను మరింత పెంచారని హరీశ్రావు అన్నారు.
ప్రస్తుతం ఆయన నారాయణఖేడ్ శాసనసభ ఉప ఎన్నిక ప్రచారంలో బిజీగా ఉన్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారంలో కెటిఆర్ బిజీగా ఉన్న సమయంలో కూడా ఆయన నారాయణఖేడ్పై దృష్టి పెట్టారు. ఒక సమయంలో మెదక్ జిల్లా పరిధిలోని గ్రేటర్ హైదరాబాద్ డివిజన్లలో పార్టీ స్థానిక నాయకుల మధ్య విభేదాలు పొడసూపినట్లు ఆయన సరి చేశారు కూడా.