తండ్రిని కొట్టి ఎత్తుకెళ్లి అమ్మాయిపై గ్యాంగ్ రేప్ (పిక్చర్స్)
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలో ఓ గిరిజన బాలికపై జరిగిన సామూహిక అత్యాచార ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. తండ్రిని కొట్టి, ఎత్తుకెళ్లి ఐదుగురు దుండగులు అమ్మాయిపై అత్యంత ఘోరంగా అత్యాచారం చేసి, ఆమెను చంపేశారు. తెలిసినవాళ్లే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని, తమను గుర్తు పట్టడం వల్లనే అమ్మాయి అత్యాచారం చేసిన తర్వాత చంపేసి ఉంటారని అనుమానిస్తున్నారు.
రాత్రిపూట నిర్మానుష్యంగా ఉన్న దారిలో మంచినీళ్ల కోసం ఆ తండ్రీకూతుళ్లు ఆగారు. చీకట్లో మాటువేసిన కొందరు దుర్మార్గులు ఆ బాలిక తండ్రి తలపై బలంగా కొట్టి, ఆమెను ఎత్తుకెళ్లి సామూహిక అత్యాచారం చేసి చంపేశారు. గురువారం రాత్రి రంగారెడ్డి జిల్లా బంట్వారం మండలం బార్వాద్ సమీపంలో ఈ దారుణం జరిగింది.
ఎత్తుకెళ్లారు...
దుండగులు సిమ్రాను ఆటోలో వేసుకుని అక్కణ్నుంచి తీసుకెళ్లిపోయారు. కొద్దిసేపటికి అటుగా వచ్చిన ఓ డీసీఎం డ్రైవర్ రోడ్డుపై స్పృహ కోల్పోయిన కమల్ను గమనించి ఆయన ముఖంపై నీళ్లు చల్లాడు. స్పృహలోకి రాగానే తన కుమార్తె కోసం చుట్టూ చూసిన కమల్ ఆమె దుండగుల బారిన పడిందనే విషయాన్ని గుర్తించాడు. వెంటనే ఆ విషయాన్ని తన కుటుంబ సభ్యులకు తెలియపరిచాడు.
రాత్రంతా గాలించారు...
కుటుంబసభ్యులు సిమ్రా ఆచూకీ కోసం రాత్రి సుమారు రెండు గంటల పాటు చుట్టుపక్కల అంతా వెతికినా ఫలితం లేకపోవడంతో మోమిన్పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు గురువారం రాత్రి ఆమె ఆచూకీ కోసం గాలించినా ఉపయోగం లేకపోయింది. శుక్రవారం ఉదయం వెతకగా బార్వాద్ గేట్ సమీపంలో విద్యుత్ సబ్ స్టేషన్ వెనకవైపు ప్రధాన రోడ్డుకు 20 మీటర్ల దూరంలో ఓ చిన్నపాటి గుంతలో ఆమె మృతదేహాం కనిపించింది. ఈ సమాచారం అందుకున్న బంట్వారం పోలీసులు సంఘటన స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఐదుగురు దుండగులు..
మొత్తం ఐదుగురు దుండగులు ఈ దారుణానికి పాల్పడినట్లు సమాచారం. మోమిన్పేట మండలం, చంద్రాయన్పల్లి కస్తూర్బా బాలికల గురుకుల పాఠశాలలో ఎనిమిదో తరగతి పూర్తి చేసిన సిమ్రా వేసవి సెలవుల్లో బంధువుల ఇంటికి వెళ్లిందని, తిరిగి వస్తూ దుర్మార్గుల చేతుల్లో పడి ఇలా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిందని ఆమె కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.
వదిలే ప్రసక్తి లేదంటూ..
గిరిజన బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడి ఆమె ప్రాణాలు తీసిన వారిని ఎట్టి పరిస్థితిల్లోనూ వదిలే ప్రసక్తే లేదని, వారిని పట్టుకోవడం కోసం ఐదు బృందాలను నియమించామని జిల్లా ఎస్పీ ఎం.శ్రీనివాస్ స్పష్టం చేశారు. సిమ్రా తలకు గాయాలయ్యాయని, ఆమె గొంతు పిసికిన ఆనవాళ్లు కూడా ఉన్నాయని, ఆమెపై లైంగిక దాడి కూడా జరిగినట్లు అటాప్సీ ప్రాథమిక నివేదికలో ఉందని ఆయన వివరించారు.
రంగారెడ్డి జిల్లాలోని మోమిన్పేట మండల పరిధి ఇజ్రా చిట్టంపల్లి తండాకు చెందిన మెగావత్ సిమ్రా (14), ఆమె తండ్రి కమల్ హైదరాబాద్లోని తమ బంధువుల ఇంటి నుంచి గురువారం రాత్రి రైల్లో వికారాబాద్కు వచ్చారు. అక్కడి నుంచి తమ స్వగ్రామానికి ద్విచక్రవాహనంపై బయలుదేరారు. మార్గమధ్యంలో బార్వాద్ గేటు సమీపంలో ఉన్న చేతిపంపు వద్ద దాహం తీర్చుకునేందుకు వాహనాన్ని ఆపారు. ఆ సమయంలో అక్కడ ఉన్న కొందరు దుండగులు సిమ్రాను చూసి ఆమెను తమతో లాక్కెళ్లేందుకు యత్నించగా కమల్ అడ్డుకున్నాడు. ఆ ప్రతిఘటనతో రెచ్చిపోయిన దుర్మార్గులు ఆయన తల పైన బలంగా బాదడంతో కమల్ స్పృహ కోల్పోయాడు.