వ్యవసాయం,నీరు-ప్రగతి బాగుంది...ఫిర్యాదులు తీసుకోండి:సిఎం చంద్రబాబు
అమరావతి:ఎపిలో నీరు-ప్రగతి ఫలితాలు బాగున్నాయని, ఉద్యోగుల సామర్థ్యం పెరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసించారు. సోమవారం ఉదయం వ్యవసాయం,నీరు-ప్రగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్యాంపు ఆఫీసులో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
నీరు-ప్రగతిలో సాధించిన విజయాలకు ఉద్యోగులకు అభినందనలు తెలిపారు.
రాష్ట్రంలో లోటు వర్షపాతం ఉన్నాఈ ఏడాది భూగర్భజల మట్టం 2 అడుగులు పెరిగిందని చంద్రబాబు చెప్పారు. జలమట్టం 15మీటర్ కంటే లోతుగా ఉన్న ప్రాంతాలపై శ్రద్ధపెట్టాలని తెలిపారు. ఇక పంటకుంటలు, కాంటూరు ట్రెంచింగ్ పనులు మరింత వేగవంతం చేయాలని సిఎం చంద్రబాబు సూచించారు.
రాష్ట్రానికి ఈ ఏడాది జాతీయ ఉపాధి హామీ పథకం నిధులు రూ.8,200 కోట్లు మంజూరయ్యాయని, అయితే రూ.10 వేల కోట్ల నిధుల వినియోగం లక్ష్యంగా పనిచేయాలని సిఎం నిర్దేశించారు. ఇప్పటికే ఈ పథకం వేతనాల కోసం రూ.719 కోట్ల నిధులు విడుదల చేశామని, అలాగే పెండింగ్ రూ.83 కోట్లు త్వరలోనే విడుదల చేస్తామని చంద్రబాబు చెప్పారు. ప్రజలకు నీటి భద్రత, విద్యుత్ భద్రత, గ్యాస్ భద్రత ఇచ్చామన్నారు.
అందరూ కలిసి అభివృద్ధిని ప్రజా ఉద్యమంగా తీసుకెళ్లాలని అధికారులకు సూచించారు.
వచ్చే ఖరీఫ్లో నూరు శాతం యాంత్రీకరణకు వెళ్లాలని, తెగుళ్ల బెడదను నియంత్రించాలని సిఎం సూచించారు. ఈ ఏడాది రబీలో తెగుళ్ళ బెడదను పూర్తిగా నియంత్రించామన్నారు. పోషకాలు ఉచితంగా ఇస్తున్నామని, దిగుబడుల పెంపే లక్ష్యంగా పనిచేయాలని చెప్పారు. నాణ్యమైన పంట దిగుబడులకు ఆంధ్రప్రదేశ్ చిరునామా కావాలని అధికారులకు సిఎం చంద్రబాబు దిశానిర్థేశం చేశారు. మన వ్యవసాయ దిగుబడులు అంతర్జాతీయ ప్రమాణాలకు ధీటుగా ఉండాలన్నారు.
ప్రకృతి సేద్యాన్ని విరివిగా ప్రోత్సహించాలని చంద్రబాబు సూచించారు. ఉబరైజేషన్లో రైతులు, డ్వాక్రా మహిళలను భాగస్వాములను చేయాలని, ఉబరైజేషన్ను మెకనైజేషన్తో అనుసంధానం చేయాలని అన్నారు.
ఉపాధి హామీకి సంబంధించి ఒక వారం జిల్లా కేంద్రంలో ఫిర్యాదులు స్వీకరించాలని, తర్వాత వారం శివారు మండల కేంద్రంలో ఫిర్యాదులు స్వీకరించాలని సీఎం సూచించారు. ఫిర్యాదుదారులకు అధికార యంత్రాంగం చేరువగా ఉండే పరిస్థితి ఉండాలన్నారు. అనంతపురం జిల్లాలో గ్రీవెన్స్ నమూనాను అన్ని జిల్లాల్లో అమలు చేయాలని చెప్పారు.
కేంద్రం నుంచి రాష్ట్రానికి ఇబ్బందులెదురైనా తమ పనితీరుతో దానిని అధిగమించాలన్నారు. వేసవి తీవ్రత దృష్ట్యా వడదెబ్బ నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఉపాధిహామీ పని వద్ద తాగునీరు, మజ్జిగ అందుబాటులో ఉంచాలన్నారు. అలాగే వడదెబ్బ నివారణపై ప్రజల్లో అవగాహన పెంచాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు.