ఐఐటీ (IIT(, ఐఐఎం(IIM)లతో సహా దేశంలోని ఉన్నత విద్యాసంస్థల్లో పెరుగుతున్న డ్రగ్ కల్చర్ కు చెక్ పెట్టేందుకు కేంద్రం సిద్దమవుతోంది. ఇందులో భాగంగా ఐఐటీ, ఐఐఎంలతో ప్రారంభించి అన్ని ఉన్నత విద్యాసంస్థల్లోనూ విద్యార్ధులకు అడ్మిషన్ల సమయంలోనే స్వచ్చంద డ్రగ్స్ టెస్టులు (Drug Tests) నిర్వహించబోతున్నారు. ఈ మేరకు కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. ఆయా సంస్థల్లో అడ్మిషన్లు కోరే అభ్యర్ధులు తమ అడ్మిషన్ పత్రాలతో పాటు యాంఫెటమైన్లు, కొకైన్, గంజాయి, బెంజోడయాజెపైన్లు, ఫెన్సైక్లిడిన్ వంటి మాదకద్రవ్యాల నిర్ధారణకు స్వచ్ఛందంగా యూరిన్ టెస్ట్ చేయించుకోవాలి.
విదేశాలకు తరలిపోతున్న IIT గ్రాడ్యుయేట్లు..! పార్లమెంట్ లో కేంద్రం షాకింగ్ రీజన్..!
ఈ టెస్టులు స్వచ్చందమేనని, అలాగే వీటి ఫలితాల్ని కూడా రహస్యంగానే ఉంచుతారని, దీంతో విద్యార్థుల అడ్మిషన్ పై ఎలాంటి ప్రభావం ఉండదని అధికారులు చెప్తున్నారు. కేంద్ర విద్యా శాఖకు చెందిన ఉన్నత విద్యా విభాగం చేపట్టిన ఈ కార్యక్రమం, దేశంలో మాదకద్రవ్యాల సమస్యను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలలో భాగంగా చెప్తున్నారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) మాదకద్రవ్యాల నియంత్రణ విజన్ డాక్యుమెంట్ 2026-29లో దీన్ని జత చేశారు. దీని ప్రకారం వచ్చే మూడేళ్లలో కేంద్ర నిధులతో నడిచే 170 ఉన్నత విద్యా సంస్థలలోని సుమారు 10 లక్షల మంది విద్యార్థులకు దశలవారీగా డ్రగ్స్ పరీక్షలు నిర్వహిస్తారు.
2029 నాటికి 10 లక్షల మంది విద్యార్థులకు మాదకద్రవ్యాల వినియోగంపై పరీక్షలు నిర్వహించే మిషన్ ను ప్రధాని మోడీ ఆగస్టు 2న ప్రారంభించారు. దీనికి 'నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్'గా పేరు పెట్టారు. ఢిల్లీ ఎయిమ్స్ లోని నేషనల్ డ్రగ్ డిపెండెన్స్ ట్రీట్మెంట్ సెంటర్ ఈ మేరకు కాలేజీలు, వర్సిటీల విద్యార్ధులకు డ్రగ్స్ పరీక్షల కోసం మార్గదర్శకాలు ఇచ్చింది. ఇందులో డ్రగ్స్ పరీక్ష పూర్తిగా స్వచ్ఛందంగా, గోప్యంగా ఉండాలని, పరీక్ష చేయించుకునే విద్యార్థులపై ఎటువంటి ప్రతికూల పరిణామాలకు దారితీయకూడదని, దీనిని కేవలం కౌన్సెలింగ్ ప్రయోజనాల కోసం మాత్రమే ఉంచాలని సూచించింది. ఈ డ్రగ్ పరీక్షల కార్యక్రమం మూడు దశల్లో అమలు చేస్తారు. మొదటి దశలో ఈ ఏడాది ఐఐటీలు, ఐఐఎంలు, ఒక సెంట్రల్ యూనివర్శిటీలో చేపడతారు. వచ్చే ఏడాది 32 ఎన్ఐటీలు, ఎనిమిది ఐఐఎస్ఆర్ లు, మూడు ఎస్పీఏలు, 25 ట్రిపుల్ ఐటీలు, కేంద్ర నిధులతో నడిచే నాలుగు జేఎన్టీయూల్లో చేపడతారు. ఆ తర్వాత 2028-29లో 46 సెంట్రల్ యూనివర్సిటీలు ,నాలుగు 'డీమ్డ్-టు-బి' విశ్వవిద్యాలయాలకు వీటిని విస్తరిస్తారు.IIT Kanpur: హ్యాకథాన్లో ఫెయిల్.. వెబ్సైట్ హ్యాక్ చేసి సవాల్- ప్రతిభకు తలవంచిన ఐఐటీ.!