మన దేశంలో సగటు సైన్స్ విద్యార్ధికి ఐఐటీ (IIT)సీటు ఓ కల. దీని కోసం ఏటా ఎన్టీఏ నిర్వహించే జేఈఈ పరీక్షల్లో లక్షల సంఖ్యలో విద్యార్ధులు తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు. ఇందుకోసం రాత్రీ పగలూ శ్రమిస్తున్నారు, లక్షల రూపాయలు ఖర్చుపెడుతున్నారు. ఇందులో కొన్ని వేల మంది మాత్రమే ఐఐటీల్లో సీట్లు సాధిస్తుంటే.. మిగిలిన వారు మాత్రం తమకు దొరికిన కాలేజీలో చేరి సరిపెట్టుకుంటున్నారు. కానీ ఐఐటీ సీటు వచ్చే స్ధాయిలో ఉన్న ఓ టాపర్ కావాలనే పరీక్ష ఫెయిల్ అయి, తన కెరీర్ ను మార్చుకుని అంతకు మించిన సక్సెస్ రుచి చూస్తే ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే రిషభ్ ఖనేజా కథ చదవాల్సిందే.
IIT క్రాక్ చేయలేదు..! కానీ టైర్-3 కాలేజీలో చేరి అద్భుతాలు..! మరో సక్సెస్ స్టోరీ..!
ముంబైకి చెందిన రిషబ్ తనేజా (Rishabh khaneja) అనే ఓ ఉన్నత కుటుంబానికి చెందిన విద్యార్ధి జీవిత గాధ వెంటే ఐఐటీలో సీటు రాకపోతే జీవితమే లేదనుకునే వారికి కనువిప్పు కలగక మానదు. సైన్స్ బ్యాక్ గ్రౌండ్ తో ఐఐటీ పరీక్ష రాసి, ఉద్దేశపూర్వకంగా తప్పి, ఆ తర్వాత ఆర్ట్స్ కెరీర్ ఎంచుకుని జీవితంలో సక్సెస్ కు నిజమైన అర్దంగా మారాడు రిషబ్. తాజాగా 'హ్యూమన్స్ ఆఫ్ బాంబే'లో పంచుకున్న ఒక పోస్ట్లో.. రిషబ్ తాను కావాలనే ఐఐటీ ప్రవేశ పరీక్షలో విఫలమయ్యానని గర్వంగా చెప్పుకున్నాడు. పరీక్ష హాల్లో కూర్చుని తప్పు అని తెలిసిన సమాధానాలనే ఉద్దేశపూర్వకంగా గుర్తించానని అంగీకరించాడు. అయితే అది తిరుగుబాటు కాదు, భయం. పరీక్షలో విఫలమవుతానన్న భయం కాదు అది, తనది కాని జీవితంలో విజయం సాధిస్తానన్న భయం అంటాడు.
రిషబ్ కుటుంబంలో పెద్ద కొడుకు కావడంతో తన భవిష్యత్తు అప్పటికే నిర్ణయం అయిపోయిందని వెల్లడించాడు. స్కూల్ స్థాయిలో సైన్స్, ఆ తర్వాత ఇంజనీరింగ్, ఎంబీఏ, చివరికి కార్పొరేట్ ఉద్యోగం - ఇలా తన చుట్టూ ఉన్నవారందరూ మెచ్చుకునే మార్గం అదే అన్నాడు. ప్రతి కుటుంబ సమావేశంలోనూ ఐఐటీలో సీటు సాధించిన వారి గురించి లేదా భారీ జీతం వచ్చే ఉద్యోగం పొందిన వారి గురించి కథలు తనకు వినిపిస్తుండేవని, కానీ వారిని కలిసినప్పుడు అతని మనసులో గమ్యం సంతోషమే అయితే, ఆ గమ్యాన్ని చేరుకున్న వారు ఎవరూ సంతోషంగా ఉన్నట్లు ఎందుకు కనిపించరనే ప్రశ్న మెదిలేది. ఆ ప్రశ్నే చివరికి అతని జీవిత గమనాన్ని మార్చేసింది. ఇంజనీరింగ్ వద్దనుకుని ఆర్ట్స్ ఎంచుకున్న రిషబ్.. తన భవిష్యత్తును పాడు చేసుకున్నాడని అంతా అనుకుంటే, అతను మాత్రం వేరేలా ఆలోచించాడు. మిథిబాయి కాలేజీలో ఆర్ట్స్ చదవాలని నిర్ణయించుకున్నాడు. ఆ తర్వాత 'టీచ్ ఫర్ ఇండియా'లో చేరాడు. అక్కడ ముంబైలోని మంఖుర్డ్ ప్రాంతంలో పిల్లలకు బోధించాడు. వెనక్కి తిరిగి చూసుకుంటే, ఏ డిగ్రీతో పోల్చినా ఆ సంవత్సరాలే తనను ఎక్కువగా తీర్చిదిద్దాయని రిషబ్ ఇప్పటికీ నమ్ముతాడు. వందలాది మంది పిల్లలు తనను 'రిషబ్ భయ్యా' అని పిలవడం, ఏ డిగ్రీ నేర్పలేని ఒక విషయాన్ని తనకు నేర్పిందని చెప్పాడు. జీవిత పరమార్థం ఎప్పుడూ బోర్డురూముల్లోనే దొరకదని, కొన్నిసార్లు ప్రతిరోజూ ఒకరి కోసం అందుబాటులో ఉండటంలోనే అది దొరుకుతుందని అంటాడు. రిషబ్ కార్పొరేట్ జీవితాన్ని కూడా ప్రయత్నించాడు. జీతం బాగుందని, సహోద్యోగులు దయగా ఉన్నారని, అయినా ప్రతి ఆదివారం సాయంత్రం అదే శూన్యత భావన మిగిలిపోయేదని వెల్లడించాడు. అందుకే రిషబ్ రాజీనామా చేసి, తన సామాను సర్దుకుని, మూడు నెలల పాటు తన రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్పై స్పితి, జాన్స్కార్, లడఖ్ అంతా తిరిగాడు. అంతులేని రోడ్లు, అందమైన ఉదయాలు, పాలపుంత కింద గడిపిన పుట్టినరోజు మధ్యలో, అందరూ నా నుండి ఆశించిన రూపం కోసం వెతకడం ఆపేశానని, తాను నిజంగా ఎలాంటి వాడినో అలాంటి వ్యక్తిగా మారడం మొదలుపెట్టానన్నాడు. ఇప్పుడు రిషబ్ బీర్ నగరంలో రచయితగా, ఫోటోగ్రాఫర్గా , కళాకారుడిగా జీవిస్తున్నాడు. తన తల్లితండ్రులు తాను సంతోషంగా ఉండాలని కోరుకున్నారని, తాను అక్కడికి చేరుకోవడానికి సొంత మార్గాన్ని కనుగొనాల్సి వచ్చిందని రిషబ్ గర్వంగా చెబుతాడు.IIT: రోజుకు రూ.77 కోట్లు సంపాదిస్తున్న ఐఐటీయన్..! ప్లేస్ మెంట్ ప్యాకేజీల చర్చ వేళ..!
IIT Madras: ఐఐటీ నుంచి తల్లీ, కొడుకూ ఒకేసారి గ్రాడ్యుయేషన్..!