ఏపీలో చికెన్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్ . చికెన్ మరియు కోడిగుడ్ల ధరలు భారీగా పెరగటం సామాన్య మధ్యతరగతి ప్రజలకు ఇబ్బందికరంగా మారింది. గత కొంతకాలంగా ధరలు వరుసగా పెరుగుతున్న క్రమంలో సామాన్యులు అహనా పెళ్ళంట సినిమా తరహాలో కోడిని వేలాడగట్టుకుని తిన్నట్టు ఫీల్ అవ్వాలా అని తెగ బాధ పడుతున్నారు. గత కొన్ని వారాలుగా ధరలు వరుసగా పెరుగుతుండటంతో చాలా మంది వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పెరిగిన చికెన్, గుడ్ల ధరలు ఇలా
ప్రస్తుతం ఏపీలోని విజయవాడ మార్కెట్లలో స్కిన్లెస్ చికెన్ కిలో రూ. 340వరకు అమ్ముతున్నారు. కేవలం కొన్ని వారాల క్రితం వరకు రూ. 250లోపు అమ్మిన ధర ఇప్పుడు గణనీయంగా పెరిగింది. అలాగే ఒక డజను కోడిగుడ్ల ధర రూ. 100కి చేరుకుంది. ఒక్కో గుడ్డు రూ. 8 నుంచి రూ. 8.50 వరకు విక్రయం అవుతోంది. పెరిగిన ధరలతో కోడి గుడ్లు కూడా తినలేని పరిస్థితి సామాన్యులకు ఇబ్బందికరంగా మారింది.
నిన్నా మొన్నటి వరకు వేసవి కాలం కావటంతో తీవ్రమైన వేసవి కారణంగా కోళ్ళ ఉత్పత్తి గణనీయంగా తగ్గింది. పౌల్ట్రీ ఫీడ్ ధరలు భారీగా పెరిగాయి. ఇందుకు తోడు పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాల సీజన్ కావడంతో మార్కెట్లో కూడా చికెన్ కు బాగా డిమాండ్ పెరిగింది. సరఫరా తగ్గడంతో పాటు డిమాండ్ పెరగటంతో ధరలు ఒక్కసారిగా పైకి లేచాయి. లైవ్ బర్డ్ ధరలు పెరగడం, రిటైల్ మార్కెట్ ఖర్చులు కూడా ఈ పెరుగుదలకు ఒక కారణంగా చెప్పొచ్చు.ఇక పెరిగిన ధరలతో సామాన్యులు నాన్ వెజ్ ముఖ్యంగా చికెన్ కూడా తినలేని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే మటన్ కిలో వెయ్యి రూపాయిలకు చేరుకోగా, సామాన్య మధ్య తరగతి ప్రజలు చికెన్ కొనుగోలు చేసి తింటారు. కానీ ప్రస్తుతం పెరిగిన ధరలు సామాన్యులను చికెన్ కూడా తిననివ్వటం లేదు. రానున్న రోజుల్లో చికెన్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని కూడా మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. చికెన్ లవర్స్ మాత్రం ఈ ధరల బాదుడు మా వల్ల కాదని, ధరలు తగ్గించేలా ప్రభుత్వం ప్రయత్నం చెయ్యాలని విజ్ఞప్తి చేస్తున్నారు.మార్కెట్ లో చికెన్ కు బాగా పెరిగిన డిమాండ్
సామాన్యులు నాన్ వెజ్ ముఖ్యంగా చికెన్ కూడా తినలేని పరిస్థితి
ధరలు తగ్గించాలని సామాన్యుల విజ్ఞప్తి