ఏపీ ప్రజలకు తీపికబురు.. సబ్సిడీ ధరలకే బియ్యం అమ్మకాలు ప్రారంభం!

రాష్ట్రంలో నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ముఖ్యంగా బియ్యం ధరలు విపరీతంగా పెరిగిన వేళ ఏపీలోని కూటమి ప్రభుత్వం సామాన్యులకు భారీ ఊరట నిచ్చే నిర్ణయం తీసుకుంది. ప్రజల పైన ఆర్థిక భారాన్ని తగ్గించే క్రమంలో బహిరంగ మార్కెట్ కంటే తక్కువ ధరకే నాణ్యమైన బియ్యాన్ని పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఇక ఈ కార్యక్రమాన్ని నేడు ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు.

Advertisement

తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం ఇస్తున్నాం అన్న ఏపీ మంత్రి

విజయవాడలోని పలు ప్రాంతాలలో ఈ పథకాన్ని ప్రారంభించిన మంత్రి నాదెండ్ల మనోహర్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతు బజార్లు మరియు ప్రభుత్వ గుర్తింపు పొందిన అవుట్ లెట్ల ద్వారా తక్కువ ధరకే బియ్యం విక్రయించనున్నట్టు తెలిపారు. ప్రస్తుతం మార్కెట్లో కిలో బియ్యం ధర రకాన్ని బట్టి 60 రూపాయల నుండి 70 రూపాయల వరకు పలుకుతోందని, అయితే ప్రభుత్వం నాణ్యమైన బియ్యాన్ని కేవలం 48రూపాయల నుండి 49రూపాయలకే అందిస్తోందని ఆయన అన్నారు.

Advertisement

గత ప్రభుత్వ విధానాల వల్లే బియ్యం ధరలకు రెక్కలు

గత ప్రభుత్వం అనుసరించిన విధానాల వల్ల సరఫరా గొలుసులో లోపాలు ఏర్పడ్డాయని, ఫలితంగా బియ్యం ధరలు విపరీతంగా పెరిగాయని మంత్రి నాదెండ్ల మనోహర్ విమర్శించారు ప్రస్తుత ప్రభుత్వం ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని బియ్యం మిల్లుల యజమానులు మరియు వర్తకులతో చర్చలు జరిపి ఈ సబ్సిడీ ధరను ఖరారు చేసింది అన్నారు. దీనివల్ల మధ్యతరగతి, నిరుపేద కుటుంబాలకు నాణ్యమైన బియ్యం తక్కువ ధరకే దొరుకుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

వారికి తీవ్ర హెచ్చరిక

ఇదిలా ఉంటే ధరలను నియంత్రించడం కోసం తక్కువ ధరకు బియ్యాన్ని విక్రయించడం మాత్రమే కాకుండా, కృత్రిమ కొరత పైన కూడా కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. మార్కెట్ నిల్వలను పర్యవేక్షిస్తున్నామని పేర్కొన్నారు. కొంతమంది వ్యాపారులు బియ్యం నిల్వచేసి కృత్రిమ కొరత సృష్టించాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు.

Advertisement
హెలిప్యాడ్‌తో.. టవర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌తో.. తెలంగాణాలో ఆ పండ్ల మార్కెట్!

అక్రమ బియ్యం నిల్వలు చేస్తే కఠిన చర్యలు

విజిలెన్స్ అధికారులు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తారని, అక్రమ నిల్వలు చేసే వారి పైన కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. మొత్తంగా తక్కువ ధరకు నాణ్యమైన బియ్యాన్ని అందించడంతో సామాన్యులు మధ్యతరగతి ప్రజలు కొంతవరకు ఊపిరి పీల్చుకుంటున్నారు.

English Summary

subsidy rice in ap: AP Civil Supplies Minister Nadendla Manohar launched the sale of quality rice at lower prices in Rythu Bazaars to provide relief to the common man from rising costs.