UAPA చట్టం: దేశ భద్రత కోసం పుట్టి, అసమ్మతి గొంతు నొక్కే ఆయుధంగా మారిందా?

ఏపీలో యూట్యూబర్ ప్రశ్న రావణ్ (Prasna Ravan) పై అత్యంత ప్రమాదకర చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA) కింద పోలీసులు తాజాగా కేసు నమోదు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై రావణ్ చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే పోలీసులు వరుసగా నాలుగు సార్లు అరెస్టులు చేయడం,, కోర్టులు బెయిల్ ఇవ్వడం జరిగిపోయాయి. దీంతో ఈసారి బెయిల్ రాకుండా ఏకంగా ఉపా చట్టం కింద కేసు నమోదు చేసి నెల్లూరు జైలుకు రిమాండ్ పై పంపారు. ఈ నేపథ్యంలో జాతీయ స్ధాయిలో మరోసారి ఉపా చట్టం చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఏంటీ ఉపా చట్టం, అసలు ఇది ఎందుకు పుట్టుకొచ్చింది, ఇప్పుడెలా మారిపోయిందా ఓసారి చూద్దాం..

Advertisement

ఉపా చట్టం నేపథ్యం (UAPA)

భారతదేశంలో ఉగ్రవాద కార్యకలాపాలను అరికట్టేందుకు ప్రతిపాదించిన 'చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం’ (UAPA) కాలక్రమేణా తీవ్రమైన మార్పులకు లోనైంది. 2004లో వివాదాస్పద 'పోటా' (POTA) చట్టాన్ని రద్దు చేసిన తర్వాత, యూఏపీఏను దేశంలో ప్రధాన ఉగ్రవాద నిరోధక చట్టంగా తీర్చిదిద్దారు. నాటి నుండి నేటి వరకు కేవలం ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే ఉద్దేశంతో సాగిన ఈ చట్ట ప్రయాణం, క్రమంగా భిన్నాభిప్రాయాలను అణచివేసే సాధనంగా ఎలా రూపాంతరం చెందిందనే అంశంపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

Advertisement

చట్టాల్లో కీలక మార్పులు

ఈ చట్టం పరిధిని పెంచేందుకు 2004 నుండి పలుమార్లు కీలక సవరణలు చేశారు. ముఖ్యంగా 2008 ముంబై దాడుల అనంతరం, అలాగే 2012, 2019లలో తీసుకొచ్చిన మార్పులు ఈ చట్టానికి మరింత పదును పెట్టాయి. ప్రారంభంలో కేవలం నిషేధిత సంస్థలపై చర్యలు తీసుకోవడానికే పరిమితమైన యూఏపీఏను, 2019 సవరణ ద్వారా ఏ గుంపుతోనూ సంబంధం లేకపోయినా ఒక వ్యక్తిని నేరుగా 'ఉగ్రవాది’గా ప్రకటించే అధికారాన్ని కేంద్ర ప్రభుత్వానికి కల్పించారు. ఈ నిర్ణయం జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)కు అపరిమిత అధికారాలను అప్పగించింది.

Advertisement

పౌర హక్కులు, బెయిల్ సవాళ్లు

మరోవైపు ఈ చట్టం కింద నమోదవుతున్న కేసులలో నిందితులకు బెయిల్ లభించడం దాదాపు అసాధ్యంగా మారుతోంది. చట్టంలోని సెక్షన్ 43D(5) ప్రకారం ఉగ్రవాద ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులు తాము నిర్దోషులని ప్రాథమికంగా నిరూపించుకునే వరకు న్యాయస్థానాలు బెయిల్ మంజూరు చేయలేవు. దీనివల్ల సామాజిక ఉద్యమకారులు, మానవ హక్కుల కార్యకర్తలు, జర్నలిస్టులు మరియు విద్యార్థులు కేవలం ప్రభుత్వ విధానాలపై అసమ్మతి వ్యక్తం చేసినందుకే జైళ్లలో మగ్గుతున్నారనే ఆరోపణలు తరచూ శాసనకర్తలను వేలెత్తి చూపుతున్నాయి.

దోషులుగా తేలేది ఎంత మంది ?

జాతీయ నేర రికార్డుల బ్యూరో (NCRB) నివేదికల ప్రకారం ఈ చట్టం కింద నమోదయ్యే కేసులలో దోషులుగా తేలే రేటు కేవలం 2 నుంచి 3 శాతంగానే ఉండడం విశేషం. అయినప్పటికీ నిందితులు ఏళ్ల తరబడి విచారణ ఖైదీలుగా కాలం వెళ్లదీయాల్సి రావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. సుప్రీంకోర్టు సైతం ఇటీవల కొన్ని కేసుల్లో 'బెయిల్ అనేది ప్రాథమిక హక్కు, జైలు కేవలం మినహాయింపు' అని వ్యాఖ్యానించినప్పటికీ, యూఏపీఏ అమలులో క్షేత్రస్థాయి పరిస్దితులు భిన్నంగా ఉన్నాయి.

Advertisement

భద్రత-హక్కుల మధ్య సమతౌల్యం

దేశ సార్వభౌమత్వాన్ని, భద్రతను కాపాడడానికి కఠినమైన చట్టాలు అవసరమే అయినప్పటికీ, అవి పౌరుల ప్రాథమిక స్వేచ్ఛను హరించేలా ఉండకూడదు. ప్రజాస్వామ్యంలో ఆరోగ్యకరమైన చర్చలు, విమర్శలు సజీవంగా ఉండాలంటే, ఉగ్రవాద నిరోధక చట్టాల దుర్వినియోగానికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భద్రతకు మరియు హక్కులకు మధ్య సరైన సమతుల్యతను సాధించడమే క్లిష్టమైన ఈ సమస్యకు ఏకైక పరిష్కారం.

English Summary

This report analyzes the evolution of India's Unlawful Activities Prevention Act (UAPA). Originally designed to counter terrorism, the law now sparks intense debate over its impact on civil liberties, the challenges of bail for prisoners, and the low conviction rates reported by the NCRB. It highlights the urgent need for a balance between national security and democratic freedom.