చంద్రబాబుకు వంశీ మరో లేఖాస్త్రం- సీఎం జోక్యం చేసుకోకపోతే..!

వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (vallabhaneni Vamsi) సీఎం చంద్రబాబుకు మొదలుపెట్టిన లేఖల పరంపర కొనసాగుతోంది. తాజాగా మరో అంశంపై చంద్రబాబుకు (Chandrababu) ఇవాళ వంశీ లేఖ రాశారు. పోలవరం కుడి కాలువ నుంచి మెట్ట ప్రాంతాలకు నీటిని ఎత్తిపోసే వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్ సరఫరాను నిలిపివేయడంతో వేలాది మంది రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వంశీ పేర్కొన్నారు. ఈ నిర్ణయం వల్ల ఇప్పటికే సాగులో ఉన్న ఖరీఫ్ పంటలు ఎండిపోయే ప్రమాదంలో ఉన్నాయని, రైతుల జీవనాధారం సంక్షోభంలో పడిందని వివరించారు.

Advertisement
గన్నవరంలో లెక్క మారబోతోందా ? యార్లగడ్డ-వంశీ పోరులో తాజా ట్విస్ట్ లు..!
Advertisement

తన నియోజకవర్గం గన్నవరం పరిధిలోని వీరపనేనిగూడెం, కొత్తగూడెం, టెంపల్లి, గొల్లనపల్లి, బల్లిపర్రు, రేమల్లె, సీతారాంపురం, నున్న తదితర గ్రామాల్లోని రైతులు గత దాదాపు 12 ఏళ్లుగా ప్రభుత్వ అనుమతులతోనే కాలువ నీటిని విద్యుత్ మోటార్ల ద్వారా ఎత్తిపోసుకుని సాగు చేస్తున్నారని వంశీ గుర్తుచేశారు. ఈ విధానం ప్రభుత్వ శాఖల పర్యవేక్షణలోనే కొనసాగిందని, రైతులు అదే నమ్మకంతో మోటార్లు, పైప్‌లైన్లు, ఇతర సాగు సదుపాయాలపై భారీగా పెట్టుబడులు పెట్టారని పేర్కొన్నారు. అయితే తాజాగా కలెక్టర్ ఆదేశాల మేరకు ఒక్కసారిగా ముందస్తు సమాచారం లేకుండా విద్యుత్ సరఫరా నిలిపివేశారని ఆరోపించారు.

Advertisement

అయ్యా.. చంద్రబాబు గారూ..! వల్లభనేని వంశీ మరో లేఖ..!

దీనికి సంబంధించిన సాంకేతిక నివేదికలు లేదా కారణాలను కూడా వెల్లడించలేదని వంశీ ఆరోపించారు. రైతుల అభిప్రాయాన్ని తీసుకోకుండా తీసుకున్న ఈ నిర్ణయం సహజ న్యాయ సూత్రాలకు, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. కృష్ణా డెల్టా రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకోవడం అవసరమే అయినా, మెట్ట ప్రాంత రైతుల సాగును పూర్తిగా నిలిపివేయడం సరైన పరిష్కారం కాదని వంశీ తెలిపారు. పంపింగ్ గంటల నియంత్రణ, మోటార్ల సామర్థ్య పరిమితి, నీటి పంపిణీ షెడ్యూల్, సాంకేతిక పర్యవేక్షణ వంటి శాస్త్రీయ విధానాలతో ఇరు వర్గాల రైతుల ప్రయోజనాలను కాపాడవచ్చని సీఎంకు సూచించారు. తక్షణం అర్హులైన రైతుల పంపుసెట్లకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని, ఉన్నత స్థాయి సాంకేతిక కమిటీని ఏర్పాటు చేసి పరిస్థితిని చక్కదిద్దాలని, పోలవరం కుడి కాలువ నుంచి మెట్ట ప్రాంతాలకు నీటి ఎత్తిపోతలపై శాశ్వత విధానాన్ని రూపొందించాలని కోరారు. అలాగే ఇప్పటికే పంటలకు జరిగిన నష్టాన్ని అంచనా వేసి రైతులకు తగిన పరిహారం అందించాలని కోరారు. ఈ లేఖకు ప్రజాప్రతినిధులు, గ్రామ నాయకులు, రైతుల సంతకాలను కూడా వంశీ జత చేశారు.