దక్షిణ కోస్తా రైల్వే పరిధిలోని గుంటూరు- రాయగడ స్టేషన్ల మధ్య రాకపోకలు సాగించే రైళ్లలో ప్రయాణించే వారికి అధికారులు ఇవాళ ఓ అలర్ట్ జారీ చేశారు. ముఖ్యంగా జూలై 8, 9 తేదీల్లో ఈ రెండు స్టేషన్ల మధ్య రాకపోకలు సాగించే రైళ్ల ప్రయాణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కాబట్టి ప్రయాణికులు వీటిని గమనించి టికెట్లు బుక్ చేసుకోవడం, ప్రయాణాలు ప్లాన్ చేసుకోవాలని దక్షిణ కోస్తా రైల్వే అధికారులు కోరుతున్నారు.
గరుడుబిల్లి-గోట్లాం, డొంకిన వలస-కోమటిపల్లి మధ్య ఎల్లుండి రైల్వే ట్రాఫిక్ కమ్ పవర్ బ్లాక్ కారణంగా గుంటూరు నుంచి రాయగడ వెళ్లే రైళ్లను విజయనగరం (Vizianagaram) వరకే నడుపుతున్నట్లు అధికారులు ప్రకటించారు. అలాగే రాయగడ నుంచి బయలుదేరాల్సిన రైళ్లను సైతం విజయనగరం నుంచే గుంటూరుకు నడుపుతున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో రాయగడ నుంచి గుంటూరు వెళ్లే ప్రయాణికులు విజయనగరం నుంచే బయలుదేరాలి. అలాగే గుంటూరు నుంచి విజయనగరం వరకూ వెళ్లి అక్కడి నుంచి రాయగడకు ఇతర మార్గాల్లో వెళ్లాల్సి ఉంటుంది.
ఎల్లుండి వరకే ఇలా గుంటూరు-రాయగడ రైళ్ల రాకపోకల్లో ఈ మార్పులు ఉంటాయి. ఈ నెల 10వ తేదీ నుంచి మాత్రం రైళ్ల రాకపోకలు యథావిధిగా సాగుతాయని అధికారులు తెలిపారు. కాబట్టి ప్రయాణికులు ఈ మార్పులు గమనించి తమకు సహకరించాలని కోరుతున్నారు. సాధారణంగా చాలా రద్దీగా ఉండే ఈ మార్గంలో ఈ మార్పుల కారణంగా మరికొన్ని రైళ్ల రాకపోకలపైనా ప్రభావం పడే అవకాశం ఉంది.