EPFO క్షమాభిక్ష పథకం, వారికి ఇదే చివరి అవకాశం


నియమ నిబంధనల ఉచ్చులో చిక్కుకుని, పాత కేసులతో సతమతమవుతున్న దేశంలోని ప్రైవేట్, ఎగ్జెంప్టెడ్ ప్రావిడెంట్ ఫండ్ (PF) ట్రస్ట్‌లకు కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చే కీలక నిర్ణయం తీసుకుంది. ఆదాయపు పన్ను (ఐటీ) చట్టాల్లో వచ్చిన సరికొత్త మార్పులకు అనుగుణంగా ప్రైవేట్ పీఎఫ్ ట్రస్ట్‌లు తమను తాము చక్కదిద్దుకునేందుకు వీలుగా 'ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్' (EPFO) ఒక ప్రత్యేకమైన 'అమ్నెస్టీ స్కీమ్-2026' (క్షమాభిక్ష పథకం)ను ప్రకటించింది. జూన్ 29, 2026 నుంచి ప్రారంభమైన ఈ ఆఫర్ సరిగ్గా ఆరు నెలల పాటు అంటే.. డిసెంబర్ 2026 చివరి వరకు అందుబాటులో ఉండనుంది.

Advertisement

అసలు సమస్య ఎక్కడ వచ్చింది?

చాలా కంపెనీలు తమ ఉద్యోగుల పీఎఫ్ డబ్బులను ఈపీఎఫ్ఓలో జమ చేయకుండా, ఆదాయపు పన్ను శాఖ గుర్తింపుతో సొంతంగా పీఎఫ్ ట్రస్ట్‌లను (Exempted Trusts) నడుపుతుంటాయి. అయితే, ఇటీవల తెచ్చిన ఫైనాన్స్ యాక్ట్ ప్రకారం.. ఆదాయపు పన్ను చట్టాల కింద గుర్తింపు కొనసాగాలంటే, ఆయా ట్రస్ట్‌లు ఖచ్చితంగా 'ఈపీఎఫ్ చట్టం-1952' లోని సెక్షన్ 17 ప్రకారం కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అధికారిక మినహాయింపు (Exemption) ఉత్తర్వులు పొంది ఉండాలి. కానీ, దేశంలో చాలా ట్రస్ట్‌లు ఐటీ శాఖ గుర్తింపుతో నడుస్తున్నప్పటికీ, ఈపీఎఫ్ఓ నుంచి పూర్తిస్థాయి మినహాయింపు పత్రాలు లేకుండానే నడుస్తున్నాయి. ఇలాంటి వాటిని ఒకే తాటిపైకి తెచ్చి, చట్టబద్ధం చేయడమే ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశం.

Advertisement
EPFO: వడ్డీ డబ్బులు పడ్డాయ్..! జమ కాని వాళ్లు కంగారు పడకండి

రెండు రకాలుగా మినహాయింపు..

ఈ పథకం కింద లబ్ధి పొందాలనుకునే అర్హులైన సంస్థలను ఈపీఎఫ్ఓ రెండు విభాగాలుగా విభజించింది.

  • మొదటి విభాగం: గత కాలానికి సంబంధించి పాత నిబంధనలను రెగ్యులరైజ్ చేసుకుని, ఇకపై ఈపీఎఫ్ఓ పరిధిలోకి (Un-exempted) వచ్చేందుకు సిద్ధంగా ఉన్న సంస్థలు.
  • రెండో విభాగం: పాత తప్పులను సరిదిద్దుకుంటూనే.. కొత్త సోషల్ సెక్యూరిటీ కోడ్-2020 ప్రకారం భవిష్యత్తులో కూడా సొంతంగానే ఎగ్జెంప్టెడ్ ట్రస్ట్‌లుగా కొనసాగాలనుకునే సంస్థలు.

EPFO: UAN యాక్టివేషన్‌కు సరికొత్త రూల్! ఎట్టకేలకు ఓపెన్ అయిన పాస్‌బుక్

Advertisement

పెనాల్టీలు మాఫీ.. పాత కేసులన్నీ రద్దు!

ట్రస్ట్‌లను ప్రోత్సహించేందుకు ఈపీఎఫ్ఓ భారీ రాయితీలను ప్రకటించింది. ఈ స్కీమ్ కింద దరఖాస్తు చేసుకునే సంస్థలకు ఉద్యోగుల కనీస సంఖ్య, నిధుల పరిమాణం (Corpus Size), మూడేళ్ల నిరంతర నిబంధనల అమలు వంటి నిబంధనల నుంచి మినహాయింపు ఇస్తారు. అన్నింటికంటే ముఖ్యంగా.. ఉద్యోగులకు ప్రభుత్వ రేటు కంటే సమానంగా లేదా అంతకంటే ఎక్కువ వడ్డీ ఇచ్చిన ట్రస్ట్‌లపై ఉన్న పాత పెండింగ్ కేసులు, జరిమానాలు (Damages), వడ్డీ వసూలు నోటీసులన్నీ పూర్తిగా రద్దయిపోతాయి. గతంలో ఇచ్చిన కఠిన ఉత్తర్వులను కూడా చెల్లకుండా చేస్తారు.

Advertisement

ఇదే చివరి అవకాశం..

కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ రూల్స్ పూర్తిస్థాయిలో అమలులోకి వచ్చేలోపు ప్రైవేట్ పీఎఫ్ ట్రస్ట్‌లు అన్నీ ఒకే చట్టం కిందకు రావాలని కార్మిక శాఖ స్పష్టం చేసింది. డిసెంబర్ 2026 గడువు ముగిసిన తర్వాత ఎలాంటి రాయితీలు ఉండవని, నిబంధనలు పాటించని ట్రస్ట్‌లపై కఠిన చర్యలు ఉంటాయని ఈపీఎఫ్ఓ హెచ్చరించింది. ఈ మేరకు దేశవ్యాప్తంగా ఉన్న రీజినల్ ఆఫీసుల ద్వారా కంపెనీలకు అవగాహన కల్పిస్తూ, దరఖాస్తుల ప్రక్రియను వేగవంతం చేశారు.

English Summary

EPFO notifies a one-time Amnesty Scheme 2026 for exempted PF trusts to align with new Income Tax frameworks