E20 పెట్రోల్ మైలేజ్ మీరు కొలవలేరు..! వాహనదారులకు గడ్కరీ మరో షాక్..!


దేశవ్యాప్తంగా ఇథనాల్ కలిపిన పెట్రోల్ (E20 Petrol)వాడకాన్ని త్వరగా పూర్తి స్ధాయిలో అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలకు అడ్డంకులు తప్పడం లేదు ఇథనాల్ కలిపిన ఈ20 పెట్రోల్ వాడకం వల్ల తమ వాహనాలు పాడైపోతున్నాయని, మైలేజ్ లు రావడం లేదని వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇథనాల్ పెట్రోల్ ను సమర్ధించుకునేందుకు కేంద్రం రోజుకో రకంగా వ్యాఖ్యలు చేస్తోంది.

Advertisement
E20 Petrolతో మైలేజీ తగ్గుతుందా? కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ క్లారిటీ?
Advertisement

ఓవైపు ఈ20 పెట్రోల్ వాడకం వల్ల వాహనాల మైలేజ్ కొద్దిగా తగ్గుతోందని ఓసారి, లేదు లేదు అసలు మైలేజ్ తగ్గదని మరోసారి చెప్తూ వస్తున్న కేంద్రం.. తాజాగా అసలు మీకు మీ వాహనాల మైలేజ్ కొలవడమే రాదంటూ వాహనదారులపై నెపం నెట్టేస్తోంది. ఇప్పటివరకూ పెట్రోల్ లేదా డీజిల్ వాహనాలను వినియోగదారులు ఇతర ఫీచర్లతో పాటు మైలేజ్ ఆధారంగానే కొనుగోలు చేస్తున్నారరు. కానీ ఇప్పుడు ఈ20 వాడకం వల్ల వచ్చే మైలేజ్ విషయంలో మాత్రం వాహనదారులకు అవగాహన లేదనేలా కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వ్యాఖ్యలు చేశారు.

E20 Petrol: సీ-ఓటర్ సర్వేలో షాక్- వద్దే వద్దంటున్న ఎన్డీఏ ఓటర్లు..!

సగటు కారు యజమాని తమ వాహనం యొక్క ఇంధన సామర్థ్యాన్ని స్వయంగా ఖచ్చితంగా కొలవలేరని, అధీకృత డీలర్లు నిర్వహించే పరీక్షలపైనే ఆధారపడాలని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తేల్చిచెప్పేశారు. ప్రభుత్వం తప్పనిసరి చేసిన ఈ20 పెట్రోల్‌కు మారిన తర్వాత నగరంలో తన కారు మైలేజ్ బాగా తగ్గిపోయిందని ఆరోపించిన ఒక జర్నలిస్ట్‌కు సమాధానంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 2023లో కొనుగోలు చేసిన, ఈ20 ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న తన కారు మైలేజ్ తాజాగా లీటరుకు 11 కిలోమీటర్ల నుండి 7 కిలోమీటర్లకు పడిపోయిందని ఆ జర్నలిస్ట్ చెప్పగా.. ఆ సంఖ్యను ఎలా లెక్కించారని గడ్కరీ ప్రశ్నించారు. డాష్‌బోర్డ్ మైలేజ్ డిస్‌ప్లేలో చూసుకున్నానని జర్నలిస్టు చెప్పగా. గడ్కరీ అధీకృత పరీక్షా పరికరాల ద్వారా మాత్రమే ఖచ్చితమైన ఇంధన-సామర్థ్య రీడింగులను పొందవచ్చని తేల్చేశారు.