సవాల్ చేస్తే కట్టుబడాలి, ఎందుకు వెళ్లలేదు - మంత్రులపై రేవంత్ సీరియస్..!!

తెలంగాణలో సవాళ్ల రాజకీయం హీటెక్కింది. మంత్రులు- బీఆర్ఎస్ మధ్య చర్చల సవాళ్లు కొత్త టర్న్ తీసుకున్నాయి. రెండు వైపుల నుంచి సై అంటే సై అన్నారు. చర్చకు సిద్దమని రెండు పార్టీ ల నేతలు ప్రకటించారు. రాజకీయంగా ఉద్రిక్తత పరిస్థితులు కనిపించాయి. కాగా, ఇదే అంశం పైన మంత్రులను సీఎం రేవంత్ మందలించారు. తెలంగాణ భవన్‌కు వస్తానని సవాలు విసిరి ఎందుకెళ్లలేదు.. సవాల్ చేస్తే కట్టుబడాలని వ్యాఖ్యానించినట్లు సమాచారం.

Advertisement

తెలంగాణలో రాజకీయంగా మారిన సవాళ్ల వ్యవహారం పైన సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేసారు. మంత్రివర్గ సమావేశంలో అధికారిక అజెండా తరువాత ఈ అంశాల పైన స్పందించారు. సవాళ్లు చేస్తే కట్టుబడి ఉండాలని వ్యాఖ్యానించారు. సవాలు చేస్తే కట్టుబడండి. తెలంగాణ భవన్‌కు వస్తానని సవాలు విసిరి ఎందుకెళ్లలేదు? అక్కడికి వెళ్లకుండా సీఎల్పీలోనే ఎందుకున్నారు?'' అని ముఖ్యమంత్రి రేవంత్‌ ప్రశ్నించినట్టు తెలుస్తోంది. అదే సమయంలో.. మనం బహిరంగ చర్చలు ఏవైనా ప్రెస్‌ క్లబ్‌ వేదికగా చేయాలని నిర్ణయం తీసుకున్నాం. కానీ కొందరు మంత్రులు గన్‌పార్క్‌కు వెళ్లారు. అక్కడ రెండు గంటల పాటు ఉన్నా.. ఆ తర్వాత వెళ్లిపోయారు. బీఆర్‌ఎస్‌ నేతలు వచ్చేదాకా వేచి ఉండాల్సింది. బహిరంగంగా చర్చించి, వాస్తవాలు చెప్పి... ప్రతిపక్షాన్ని ఆత్మరక్షణలోకి నెట్టేసే అవకాశాన్ని వదులుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.

Advertisement

మంత్రులకు దిశా నిర్దేశం

అదే సమయంలో అసలు ప్రతిపక్ష పార్టీల వద్ద లేవనెత్తేందుకు, చర్చించేందుకు సరైన అంశాలే లేవు. వాళ్లకు మీరే పని కల్పించొద్దని చురకలంటించినట్టు తెలుస్తోంది. గురుకులాల టెండర్ల వ్యవహారంలో అవినీతి జరగనప్పటికీ.. జరిగినట్లుగా బీఆర్‌ఎస్‌ చేస్తున్న విమర్శలను తిప్పి కొట్టే అవకాశాన్ని మిస్ చేసుకున్నామని సీఎం అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. రికార్డుస్థాయిలో ధాన్యం కొనుగోళ్లు చేశాం. రుణమాఫీ చేశాం. గృహజ్యోతి, ఉచిత బస్సు వంటి ఎన్నో పథకాలు అమలు చేస్తున్నాం, ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు అమలు చేస్తున్నామని రేవంత్ చెప్పుకొచ్చారు. ఆర్థికంగా ప్రతికూలతలు ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం, ప్రజల్లోకి వెళ్లడానికి ప్రతిపక్షాలకు అవకాశం లేకుండా చేశామని పేర్కొన్నారు. ఇటువంటి సమయంలో కొత్త సవాళ్లు విసరడం ద్వారా సమస్యలు సృషించొద్దని సీఎం సూచించినట్టు తెలుస్తోంది. కాగా, మూసీ పునరుజ్జీవన పథకం తొలి దశ 2027 డిసెంబరుకల్లా పూర్తిచేసి, ఆ తర్వాతే శాసనసభ ఎన్నికలకు వెళ్లాలని ముఖ్యమంత్రి నిర్దేశించినట్లు సమాచారం.

English Summary

CM Revanth angry over his cabinet ministers on the open challenges issued to BRS leaders, after developments