కేంద్రమంత్రులతో రేవంత్ రెడ్డి వరుస భేటీలు- ప్రతిపాదనలు: అవి ఓకే అయితే మాత్రం..


తెలంగాణ ప్రగతి సాధనే ఏకైక లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశ రాజధానిలో విస్తృతంగా పర్యటిస్తోన్నారు. ఇందులో భాగంగా వివిధ కేంద్ర మంత్రులతో వరుస భేటీలు నిర్వహిస్తోన్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలకమైన అభివృద్ధి, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై సుదీర్ఘంగా చర్చలు జరిపారు. రాష్ట్రంలో రోడ్డు రవాణా, పౌర విమానయాన రంగాలను పరుగులు పెట్టించే ఉద్దేశంతో కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, కింజరాపు రామ్మోహన్ నాయుడితో ఆయన ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. పలు ప్రతిపాదనలు సమర్పించారు.

Advertisement

కొద్దిసేపటి కిందటే ఢిల్లీలో నంబర్ 2, మోతీలాల్ నెహ్రూ మార్గ్‌లో గల రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ నివాసానికి చేరుకున్నారు రేవంత్ రెడ్డి. ఆయనతో భేటీ అయ్యారు. సుమారు 40 నిమిషాల పాటు ఈ సమావేశం కొనసాగింది. తెలంగాణ వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న జాతీయ రహదారుల విస్తరణ పనులు, నూతన రహదారుల ప్రాజెక్టుల మంజూరు, మౌలిక వసతుల కల్పనపై ప్రధానంగా చర్చించారు.

Advertisement

రాష్ట్రంలో రవాణా వసతులు, మౌలిక సదుపాయాలను త్వరితగతిన పూర్తి చేయాలని, ప్రధాన రహదారుల అనుసంధానాన్ని వేగవంతం చేయాలని కేంద్ర మంత్రిని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి కోరారు. ప్రత్యేకించి.. రీజినల్ రింగ్ రోడ్డు పనులను ఎలాంటి అడ్డంకులు లేకుండా నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని తాము భావిస్తోన్నామని, దీనికి సహకరించాలని చెప్పారు. అలాగే పలు ప్రధాన రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా అప్‌గ్రేడ్ చేయాలని విజ్ఞప్తి చేశారు.

నో బ్రేక్.. ఈ వారంలో రెండో రోజు కూడా పసిడి రేట్ల పతనం.. !!
Advertisement

వీటన్నింటిపైనా నితిన్ గడ్కరీ సానుకూలంగా స్పందించారు. తెలంగాణ అభివృద్ధికి అవసరమైన జాతీయ రహదారుల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు. ఈ భేటీతో ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న రహదారి సమస్యలకు పరిష్కారం లభించే అవకాశం కనిపిస్తోంది. అనంతరం రేవంత్ రెడ్డి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడితోనూ సమావేశం అయ్యారు.

టీటీడీకి తమిళనాడు నుంచి అందిన శ్వేతాశ్వం: ప్రధాన ఆకర్షణగా.. !!

తెలంగాణలో విమానయాన రంగ కార్యకలాపాలను మరింత విస్తరించడంపై చర్చించారు. దీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉంటూ వస్తోన్న ఆదిలాబాద్, మామునూర్ విమానాశ్రయాల నిర్మాణ రూపకల్పన, వాటికి సంబంధించిన మౌలిక వసతుల కల్పనపై ప్రధానంగా ఈ చర్చ సాగింది. ఈ రెండు విమానాశ్రయాల నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించేందుకు అవసరమైన అన్ని రకాల సాంకేతిక అనుమతులను వీలైనంత త్వరగా మంజూరు చేయాలని పేర్కొన్నారు.

Advertisement

హైదరాబాద్ నగర ప్రయాణికులకు అత్యంత కీలకమైన హైదరాబాద్ మెట్రో రైల్ రెండో దశ ప్రాజెక్టుకు సంబంధించిన ముందస్తు అనుమతులను కూడా త్వరితగతిన క్లియర్ చేయాలని కేంద్ర మంత్రిని కోరారు. మెట్రో విస్తరణ ద్వారా నగర శివారు ప్రాంతాల వరకు మెరుగైన ప్రజా రవాణా అందుబాటులోకి వస్తుందని ఆయన వివరించారు.

English Summary

CM Revanth Reddy Meets Nitin Gadkari for Major Road and Infrastructure Projects in Telangana Discussed. The meeting lasted for over 30 minutes, during which the two leaders discussed various developmental projects and infrastructure initiatives related to Telangana.