హైదరాబాద్ లో ఘన వ్యర్థాల నిర్వహణను మరింత మెరుగుపరిచే దిశగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ముందడుగు వేసింది. నగర వాసులకు తమ ఇళ్లలోని పాత పరుపులు, నిరుపయోగంగా ఉన్న పాత ఫర్నిచర్ను ఉచితంగా పారవేసేందుకు వీలు కల్పించింది. దీనికోసం డోర్స్టెప్ పికప్ సేవలను అధికారికంగా ప్రారంభించింది. దీని ద్వారా స్థానికులు తమ పాత ఫర్నిచర్ ను నేరుగా మున్సిపల్ సిబ్బందికే అందజేసే అవకాశం లభించింది.
సాధారణంగా ప్రతి ఏటా వానాకాలంలో హైదరాబాద్ లో నాలాలు పేరుకుపోతుంటాయి. వాటిల్లో ఎక్కువగా కనిపించేవి పాత పరుపులు, విరిగిపోయిన మంచాలు, సోఫాలే. వీటి వల్ల నగరంలో డ్రైనేజీ సమస్యలు తలెత్తుతున్నాయి. నాలాల ప్రవాహానికి ఇవి అడ్డుపడటం వల్ల లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. ఈ సమస్య తీవ్రతను గుర్తించిన మున్సిపల్ అధికారులు.. తాజా చర్యలు తీసుకున్నారు. నగర వీధులను స్వచ్ఛంగా ఉంచడంతో పాటు వరద ముప్పును నివారించడానికి ఈ ప్రత్యేక ఉచిత డ్రైవ్కు శ్రీకారం చుట్టారు.
చాలా మంది తమ ఇళ్లలోని పాత సామాగ్రిని ఎక్కడ పారవేయాలో తెలియక గందరగోళానికి గురవుతుంటారు. వీటిని సుదూర ప్రాంతాలకు తరలించేందుకు ప్రైవేట్ రవాణా వాహనాలను ఆశ్రయిస్తే భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. దీనికి భయపడి పలువురు రాత్రి సమయాలలో గుట్టుచప్పుడు కాకుండా ఖాళీ ప్రదేశాలు, రోడ్డు, నల్లాల పక్కన పడేస్తుంటారు. దీనివల్ల నగర అందాలు దెబ్బతినడంతో పాటు ప్రజా ఆరోగ్యానికి కూడా ముప్పు వాటిల్లుతోంది. జీహెచ్ఎంసీ ప్రవేశపెట్టిన ఈ ఉచిత సేవల వల్ల ఈ సమస్య తీరినట్టయింది. జీహెచ్ఎంసీ ఈ ఉచిత సేవను వినియోగించుకోదలిచిన వారు తమ మొబైల్ ఫోన్ల ద్వారా క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి నేరుగా బుక్ చేసుకోవచ్చు. పూర్తి వివరాలు, చిరునామాను సమర్పించిన వెంటనే, శానిటేషన్ సిబ్బంది నిర్దేశిత తేదీన ఇంటి వద్దకే వాహనంతో చేరుకుంటారు. ఎటువంటి అదనపు రుసుము వసూలు చేయకుండా మీ పాత సామాగ్రిని సేకరిస్తారు. ఈ వినూత్న పథకం ద్వారా సేకరించిన పాత పరుపులు, ఫర్నిచర్ను కాలుష్య నియంత్రణ మార్గదర్శకాలకు అనుగుణంగా రీసైక్లింగ్ కేంద్రాలకు తరలిస్తారు. అక్కడ పర్యావరణానికి ఎటువంటి హాని కలగకుండా, అత్యంత శాస్త్రీయ పద్ధతిలో రీసైక్లింగ్ ప్రక్రియను చేపడతారు. వ్యర్థాల నుండి తిరిగి ఉపయోగించదగిన ప్లాస్టిక్, చెక్క, స్పాంజ్ వంటి పదార్థాలను వేరు చేసి పర్యావరణ సమతుల్యత దెబ్బతినకుండా చూస్తారు. ఇది నగరంలో కొత్త వ్యర్థాలు క్రమపద్ధతిలో తగ్గిపోయేందుకు దోహదం చేస్తుంది.