మూడు పార్టీల భవిష్యత్ తేల్చనున్న 'గ్రాడ్యుయేట్స్' - అభ్యర్ధుల ఖరారు, సెమీ ఫైనల్స్..!!

తెలంగాణ రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. 2034 వరకు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని సీఎం రేవంత్ ధీమాగా చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది తామేనని బీఆర్ఎస్ నమ్మకంతో ఉంది. ఊహించని విధంగా ప్రజలు తమకు పట్టం కడతారని బీజేపీ చెబుతోంది. ఇదే సమయంలో గ్రేటర్ ఎన్నికలు.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు మూడు పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారుతున్నాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు అభ్యర్ధులను దాదాపు ఖరారు చేసారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందుగా ఇవి సెమీ ఫైనల్స్ గా మారుతున్నాయి.

Advertisement

తెలంగాణలో మరో ఎన్నికల సమరానికి పార్టీలు సై అంటున్నాయి. రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. హైదరాబాద్‌-రంగారెడ్డి- మహబూబ్‌నగర్‌, వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనుండడంతో ప్రధాన పార్టీలు ఇప్పటి నుంచే సన్నద్ధమవుతున్నాయి. అభ్యర్థుల ఎంపికకు కసరత్తు చేస్తున్నాయి. ఇవి సెమీ ఫైనల్స్ గా భావిస్తున్న ప్రధాన పార్టీలు.. వీటిలో గెలిస్తే అసెంబ్లీ ఎన్నికలకు పెద్ద సానుకూల అంశంగా మారుతుందని భావిస్తున్నాయి. సుమారు 14 లక్షల మంది పట్టభద్రులు తీర్పు ఇచ్చే ఈ ఎన్నికలు.. ప్రధాన పార్టీల మధ్య మినీ మహాసంగ్రామం కానుంది. కాగా, హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సురభి వాణీదేవి, వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ స్థానం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న తీన్మార్‌ మల్లన్న పదవీకాలం వచ్చే ఏడాది మార్చి 27తో ముగియనుంది.

Advertisement
ఇక సిద్దం అయిపోండి, ఆగస్టు 5 - కేంద్రం సంచలన నిర్ణయం..!?

అభ్యర్దిత్వం కోసం పెరుగుతున్న పోటీ

కాగా, మార్చి 29 కల్లా ఈ స్థానాల్లో కొత్త ఎమ్మెల్సీలు ఎన్నిక కావాల్సి ఉంది. కాంగ్రెస్‌ పార్టీలో అభ్యర్థిత్వం కోసం తీవ్ర పోటీ నెలకొని ఉంది. హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ స్థానం నుంచి టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్‌ సామ రామ్మోహన్‌రెడ్డి, తెలంగాణ పీఆర్టీయూ వ్యవస్థాపక అధ్యక్షుడు, టీపీసీసీ అధికార ప్రతినిధి హర్షవర్ధన్‌రెడ్డి, రాష్ట్ర యువజన కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు శివసేనారెడ్డి, పార్టీ నేత గౌరీ సతీశ్‌ తదితరులు పోటీ పడుతున్నారు. ఇక వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ స్థానం నుంచి టూరిజం కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ పటేల్‌ రమేశ్‌రెడ్డి, విజయా డెయిరీ మాజీ చైర్మన్‌ గుత్తా అమిత్‌రెడ్డి రేసులో ఉన్నారు. హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం బీఆర్‌ఎస్‌ సిటింగ్‌ ఎమ్మెల్సీ వాణీదేవి.. వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ స్థానం నుంచి ఐఆర్‌ఎస్‌ అధికారి ఒకరిని బీఆర్‌ఎస్‌ తరపున పోటీకి దించే ఆలోచన చేస్తున్నారు. అదే విధంగా శాప్‌ మాజీ చైర్మన్‌ వెంకటేశ్వర్‌రెడ్డి, పార్టీ సీనియర్‌ నేత ఆంజనేయగౌడ్‌ ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఇక వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ స్థానం నుంచి గతంలో పోటీ చేసిన ఏనుగుల రాకేశ్‌రెడ్డినే మళ్లీ రంగంలోకి దించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ రెండు స్థానాల్లో గెలిస్తే.. అసెంబ్లీ ఎన్నికలకు సానుకూలత ఏర్పడుతుందనే భావనతో.. ప్రధాన పార్టీలు వీటిని ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్నాయి.

English Summary

Graduates MLC elections are set to be held next March, prompting Congress and BRS to begin finalizing their candidates early