సికింద్రాబాద్ లష్కర్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరలో కీలక ఘట్టం 'రంగం'. కొద్దిసేపటి కిందటే ఈ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో వైభవంగా జరిగింది. ఆలయం ఆవరణలో మట్టి కుండపై నిలబడి జోగిని మాతంగి స్వర్ణలత తన భవిష్యవాణిని వినిపించారు. ఈ వేడుకలను తిలకించడానికి వచ్చిన వేలాదిమంది భక్తులతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి.
ఈ ఏడాది భవిష్యవాణి వినిపిస్తూ మాతంగి స్వర్ణలత ప్రజలకు, ప్రభుత్వానికి హెచ్చరికలు చేశారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో కుంభవృష్టి ఉంటుందని, అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని అన్నారు. ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. భారీ వర్షాలే కాకుండా, ఊహించని రీతిలో అగ్ని ప్రమాదాలు సంభవించే ముప్పు ఉందని పేర్కొన్నారు. వరద ఉధృతి పెరిగి జనాలు కొట్టుకుపోయే ప్రమాదాలు పొంచి ఉన్నాయని, ప్రాణనష్టం భారీగా ఉంటుందని అన్నారు.
సమాజంలో మానవ సంబంధాలు, నైతిక విలువల పతనంపై భవిష్యవాణిలో తీవ్ర అసంతృప్తిని, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ కాలంలో మనుషులు వావివరుసలు లేకుండా ఘోరాలకు పాల్పడుతున్నారని, ఇటువంటి అకృత్యాలకు ఒడిగడుతున్న వారిని తాను ఎంతమాత్రం వదిలిపెట్టనని, పాదాల కింద నలిపేస్తానని హెచ్చరించారు. తనకు సంతోషం లేకుండా చేస్తున్నారని అమ్మవారి రూపంలో ఆవేదన చెందారు. తాను చెప్పింది ఏదీ ఆచరించట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల్లో అహంకారం ఎక్కువ అవుతోందని స్వర్ణలత ఆక్షేపించారు. దీన్ని తగ్గించుకుంటేనే బాగుపడతారని, ఈ సంవత్సరం ఎంతో బాధపెట్టారని, కంటతడి పెట్టించారని అన్నారు. ఆరు నెలల్లో విగ్రహ ప్రతిష్ట చేయకపోతే ప్రాణనష్టం తప్పదని అమ్మవారి రూపంలో మాతంగి స్వర్ణలత తేల్చి చెప్పారు. ఇక్కడికి సంతోషంగా రాలేదని, మితిమీరిన క్రోధంతో వచ్చానని చెప్పారు. విగ్రహం ప్రతిష్ట చేస్తానని మాట ఇచ్చి తప్పారని, ఏ ఆపద వచ్చినా, ప్రమాదం వచ్చినా కంటి రెప్పల్లా కాపాడుతున్నప్పటికీ.. భక్తులు చేసే చర్యలు ఆగ్రహాన్ని తెప్పిస్తోందని అన్నారు. భక్తులు సమర్పించే నైవేద్యాలు, పూజలను అంగీకరిస్తున్నానని చెప్తూనే, ఆలయంలో తగిన నిబంధనలు పాటించాలని ఆదేశించారు. లష్కర్ బోనాల పండగలో రంగం కార్యక్రమానికి తెలంగాణ సంస్కృతిలో ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడ అమ్మవారి ప్రతిరూపంగా జోగిని పలికే ప్రతి పలుకు నిజమవుతుందని భక్తుల విశ్వాసం. ఈసారి కుంభవృష్టి వర్షాలు, ప్రాణనష్టం కలిగించే వరదలు, అగ్నిప్రమాదాల గురించి హెచ్చరికలు వచ్చిన నేపథ్యంలో, ఉజ్జయిని మహాకాళితో పాటు ఇతర అమ్మవార్ల పూజల విషయంలో భక్తులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారనేది వేచి చూడాలి.లాభాల బాట పట్టిన బంగారం ధరలు- బిగ్ బెట్
ప్రశాంత్ కిశోర్ భవితవ్యం తేలుతోంది.. !!