కర్రలు, రాళ్లతో కాంగ్రెస్ నేతల కొట్లాట.. అర్వపల్లిలో తీవ్ర ఉద్రిక్తత! (వీడియో)

సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండల కేంద్రం కాంగ్రెస్ పార్టీ అంతర్గత వర్గవిభేదాలతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఎమ్మెల్యే మందుల సామేల్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి వర్గాల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ చెలరేగింది. ఇరువర్గాలు కర్రలు, రాళ్లతో పరస్పరం దాడులకు తెగబడ్డారు. ఇరువర్గాల కాంగ్రెస్ నాయకులు పలు వాహనాలను ధ్వంసం చేశారు. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని అడ్డుకునేందుకు లాఠీఛార్జ్ కూడా చేశారు. ఈ గొడవలో పలువురు కాంగ్రెస్ నాయకులకు, పోలీసులకు గాయాలయ్యాయి.

Advertisement

ఇటీవల అధికార పార్టీలో నామినేటెడ్ పోస్టుల నియామకాలు కాంగ్రెస్‌లో ఇంఛార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య వివాదంగా మారినట్లు తెలుస్తోంది. తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ మండల అధ్యక్ష ఎన్నికలే ఈ వివాదానికి ప్రధాన కారణమని సమాచారం. స్థానిక ఎమ్మెల్యే మందుల సామేల్ ఏకపక్షంగా తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే ఈ ఎన్నికలను పూర్తి చేశారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి వర్గీయులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ వచ్చారు. నిబంధనలను విరుద్ధంగా జరిగిన ఈ ఎన్నికలను తక్షణమే రద్దు చేయాలనే డిమాండ్ తో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వర్గీయులు, స్థానిక నాయకులు హైదరాబాద్ లోని గాంధీ భవన్ కు భారీగా కలిసి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మందుల సామేల్ వర్గీయులు అర్వపల్లి మండల కేంద్రంలోనే రోడ్లపైకి వచ్చి ఎంపీ అనుచరుల వాహనాలను అడ్డుకున్నారు. ఈ క్రమంలో తీవ్రస్థాయి వాగ్వాదం చోటుచేసుకుంది.

Advertisement

వాగ్వాదం కాస్తా.. రణరంగంగా..
ఈ క్రమంలో మాటా మాట పెరగడంతో తీవ్రంగా మండిపడిన ఎమ్మెల్యే వర్గీయులు.. ఎంపీ చామల, రాంరెడ్డి వర్గీయులపై రాళ్లు, కర్రలతో దాడికి దిగారు. దీనితో ఎంపీ వర్గం కూడా తిరగబడటంకో అర్వపల్లి జంక్షన్ రణరంగంగా మారింది. ఇరు వర్గాలు విచక్షణా రహితంగా రాళ్లు రువ్వుకోవడంతో అక్కడ ఉన్న కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. కర్రలతో పరస్పర దాడులకు పాల్పడటంతో ఇరుపక్షాలకు చెందిన కీలక నాయకులు, కార్యకర్తలు గాయపడ్డారు.

రంగంలోకి పోలీసులు.. లాఠీ ఛార్జ్
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అదనపు బలగాలతో ఘటనాస్థలికి చేరుకుని ఘర్షణను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. కానీ నాయకులు వినకుండా దాడులకు దిగారు. ఈ ఘటనలో పలువురు పోలీసులకు కూడా గాయాలయ్యాయి. ఈ క్రమంలో శాంతి భద్రతలను కాపాడేందుకు పోలీసులు లాఠీఛార్జ్ ప్రారంభించారు. ఘర్షణకు దిగిన కాంగ్రెస్ నాయకులను, కార్యకర్తలను చెదరగొట్టారు. ప్రస్తుతం అర్వపల్లిలో అదనపు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ గొడవకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

English Summary

Suryapet Congress Clash, A violent clash erupted between Congress party factions in Arvapally, Suryapet district, over mandal elections. Leaders used sticks and stones, leaving police injured.