రోడ్డెక్కనున్న టీచర్లు - మహా ధర్నాకు పిలుపు- ఆగస్టు నెలలో..!!

బడి గడప దాటి రోడ్డెక్కాల్సిన దుస్థితి తెలంగాణ ఉపాధ్యాయులకు మళ్లీ వచ్చింది.సమాజానికి దిశానిర్దేశం చేసి,రేపటి తరాన్ని తీర్చిదిద్దే గురువులు నేడు తమ కనీస హక్కుల సాధన కోసం సుదీర్ఘ పోరాటానికి సిద్ధమవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అలసత్వ వైఖరి,ప్రభుత్వ విద్యా రంగం పట్ల చూపుతున్న నిర్లక్ష్యంపై ఉపాధ్యాయ లోకం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది.ఈ క్రమంలోనే తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు 7 నుంచి రాష్ట్రవ్యాప్తంగా దశలవారీ ఉమ్మడి ఆందోళనలు చేపట్టనున్నట్లు ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (TUSPC) ప్రకటించింది.

Advertisement

ఏళ్ల తరబడి పరిష్కారం కాని సమస్యలు,అధికారుల చుట్టూ తిరిగినా లభించని సమాధానాలు ఉపాధ్యాయుల్లో తీవ్ర నిరాశను, అశాంతిను రేకెత్తిస్తున్నాయి.బదిలీలు,పదోన్నతుల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూసి అలసిపోయిన గురువులు ఇప్పుడు తమ ఉనికిని, ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి వీధుల్లోకి రావాల్సిన నిస్సహాయ పరిస్థితి ఏర్పడింది. విద్యా వ్యవస్థను సంస్కరించడంలో పాలకులు విఫలమయ్యారంటూ TUSPC నాయకులు ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడుతున్నారు. తమ గోడును పాలకులకు వినిపించేందుకు ఈ ఆందోళన బాట పట్టడం మినహా తమకు మరో మార్గం లేదని వారు స్పష్టం చేశారు.

Advertisement

కీలక డిమాండ్లు ఇవే..

ఉపాధ్యాయుల ప్రధాన డిమాండ్లలో బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియను తక్షణమే పూర్తి చేయడం, వివాదాస్పద జీవో 25కు అనుకూల సవరణలు చేయడం ఉన్నాయి. ప్రతి ప్రాథమిక పాఠశాలలో కనీసం ఇద్దరు టీచర్లను నియమించాలని, ఖాళీగా ఉన్న డీఈఓ (DEO), ఎంఈఓ (MEO) పోస్టులను భర్తీ చేయాలని కోరుతున్నారు. సుదీర్ఘ కాలంగా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవారికి టెట్‌లో వెయిటేజీ కల్పించడంతో పాటు, కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కేమ్ (CPS) ను రద్దు చేసి పాత పెన్షన్ (OPS) విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు. పెండింగ్‌‌లో ఉన్న ఐదు విడతల కరువు భత్యం (DA) తో పాటు దాదాపు రూ.2,000 కోట్ల విలువైన వైద్య, ఇతర బిల్లులను వెంటనే విడుదల చేయాలని స్పష్టం చేశారు. మోడల్, ఎయిడెడ్ స్కూళ్లను విద్యాశాఖ కిందకు విలీనం చేయాలని కోరారు.అదే సమయంలో జీవో 190,317ను అమలు చేయాలని పోరాట సమితి డిమాండ్ చేసింది.

Advertisement
దగ్గరుండి మరీ కాపీ కొట్టించి.. అడ్డంగా దొరికిన టీచర్లు!

ఆందోళనా కార్యక్రమాల వివరాలు

ఆగస్టు 7వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన ప్రారంభిస్తారు.ఆగస్టు 12,13వ తేదీల్లో అన్ని మండల కేంద్రాల్లో అధికారులకు వినతి పత్రాలను సమర్పించడం జరుగుతుంది.ఆగస్టు 19వ తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లో ఉపాధ్యాయులతో భారీ ధర్నా చేపడతారని యూనియన్ తెలిపింది.ఆగస్టు 21 నుంచి 26వ తేదీ వరకు రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో నేతల విస్తృత పర్యటనలుంటాయని...చివరిగా ఆగస్టు 29వ తేదీన ఇందిరా పార్కు వద్ద ఉన్న ధర్నా చౌక్ వేదికగా వేలాది మందితో మహాధర్నాకు యూనియన్ పిలుపునిచ్చింది.

Advertisement
టీచర్లు, లెక్చరర్లకూ బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్న భోజన పథకం.. క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఈ ఆందోళనల తర్వాత కూడా ప్రభుత్వం స్పందించకపోతే సెప్టెంబర్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా వేలాది మందితో 'చలో అసెంబ్లీ'కార్యక్రమాన్ని నిర్వహిస్తామని TUSPC నేతలు హెచ్చరించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మొండివైఖరిని వీడి, ఉపాధ్యాయులతో తక్షణమే చర్చలు జరపాలని డిమాండ్ చేస్తున్నారు.

English Summary

Telangana teachers announce statewide protests from August 7, demanding transfers, promotions, OPS restoration, DA release and resolution of pending issues.