హైదరాబాద్‌లో భారీగా ఓట్ల కోత - మునిగేదెవరు..!?

హైదరాబాద్ కేంద్రంగా రాజకీయం ఆసక్తి కరంగా మారింది. గ్రేటర్ లో త్వరలో ఎన్నికల దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే సంక్షేమ పథకాలతో పాటుగా కీలక నిర్ణయాలను అమలు చేస్తున్నారు. అటు ప్రధాన పార్టీలు సైతం గ్రేటర్ పైన రాజకీయంగా ఫోకస్ చేసాయి. హైదరాబాద్ లో రాజకీయ పట్టు కోసం ప్రయత్నిస్తున్నాయి. ఇదే సమయంలో సర్ ప్రక్రియలో భాగంగా నగరం లో భారీగా ఓట్ల కోత ఖాయమనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ పరిణామం రాజకీయం గా ఎవరిని ముంచుతుందనే చర్చ మొదలైంది.

Advertisement

సర్ ప్రక్రియ ఇప్పుడు రాజకీయ పార్టీల్లో గుబులు పుట్టిస్తోంది. పలు రాష్ట్రాల్లో ఓట్ల తొలిగింపు పైనా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఏపీలోనూ దాదాపు 45 లక్షల ఓట్లు డిలేట్ అయ్యాయి. వీరికి ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. వారు ఇచ్చే వివరణ ఆధారంగా ఓట్ల తొలిగింపు.. లేదా కొనసాగింపు పైన నిర్ణయం తీసుకోనున్నారు. కాగా..తెలంగాణలో సర్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నెల 10వ తేదీ వరకు గడువు పొడిగించారు. ఇదే సమయంలో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. హైదరాబాద్‌లో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియలో భాగంగా ఎన్యూమరేషన్‌ ఫారాల డిజిటైజేషన్‌ 40 శాతానికి పైగా ఇంకా పెండింగ్‌లోనే ఉంది. ఇందులో దాదాపు 25 శాతానికి పైగా ఫారాలు తీసుకోని వారు ఉన్నారని అధికారులు చెబుతున్నారు. జిల్లాలో 47.36 లక్షల ఓటర్లు ఉండగా.. ఇప్పటి వరకు 27.26 లక్షల (57.56 శాతం) ఓటర్ల వివరాలు డిజిటైజ్‌ చేసినట్లు అధికారిక సమాచారం.

Advertisement
డీలిమిటేషన్ పై ఊహించని నిర్ణయం, మారుతున్న లెక్కలు- ఇక నెక్స్ట్.!!

అధికారుల తుది కసరత్తు

అయితే, పలువురు ఓటర్లు నివాసాలు మారటం.. ఇళ్ల వద్ద అందుబాటులో లేకపోవడం, మరణించడం వంటి కారణాలతో ఏకంగా 9.95 లక్షల ఓటర్లను ఆబ్‌సెంట్‌ షిఫ్ట్‌ డెడ్‌ (ఏఎస్‌డీ) జాబితాలో చేర్చినట్లు తెలుస్తోంది. గడువులోగా వివరాలు సమర్పించిన వారి పేర్లనే ముసాయిదాలో ఉంచి, మిగతా వారి పేర్లు తొలగిస్తామని ఎన్నికల విభాగం వర్గాలు పేర్కొన్నాయి. ఫోన్‌ చేసిన స్పందించని వారు, గ్రామాల్లో ఓటు ఉందంటున్న వారి సంఖ్య గణనీయంగానే ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే.. ఈ జాబితాలో ఎక్కువగా బహదూర్‌పురాలో 63.35శాతం, కార్వాన్‌లో 62.01, సికింద్రాబాద్‌లో 60.41శాతం డిజిటైజేషన్‌ పూర్తయింది. అత్యల్పంగా సనత్‌నగర్‌లో 53.52 ఉన్నట్లు తెలుస్తోంది. అదే విధంగా మలక్‌పేటలో 53.90, ముషీరాబాద్‌లో 54.01శాతం నమోదైంది. ఆన్‌లైన్‌ ద్వారా 4.91 లక్షల ఫారాలు రాగా.. అందులో 4.89 లక్షల దరఖాస్తులను బీఎల్‌వోలు పరిశీలించినట్లు సమాచారం. దీంతో.. హైదరాబాద్ లో ఈ ఓట్ల ప్రభావం ఏ పార్టీ పైన పడుతుంది.. ఎలాంటి ఫలితాలకు కారణమవుతుందనే చర్చ మొదలైంది.

English Summary

Voters in Hyderabad: Around 40% of the enumeration forms collected under the Special Intensive Revision (SIR) are yet to be digitized