తెలంగాణలో ఏఐ డిజిటల్ హైవేలు.. ఇక ఎవరూ తప్పించుకోలేరు..!
ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) వినియోగం క్రమంగా పెరుగుతోంది. ఎవరి నోటి వెంట విన్నా ఏఐ మాటే వినిపిస్తోంది. ఏఐ సర్వాతర్యామిగా మారిపోతుంది. మానవుడు పరిష్కరించలేని అనేక సవాళ్లు, సంక్లిష్టమైన ప్రశ్నలకు ఏఐ క్షణాల్లో సమాధానం ఇస్తోంది. అయితే ఇప్పుడు పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఏఐను సమర్థవంతంగా వినియోగించుకుంటున్నాయి. ఏఐ సాయంతో రోడ్డు ప్రమాదాల నివారణకు పలు ప్రణాళికలు రచిస్తున్నాయి.
ఇప్పటికే దేశంలోనే తొలి ఏఐ డిజిటల్ హైవే అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. దిల్లీ- గురుగ్రామ్ లను కలిపే ద్వారకా ఎక్స్ ప్రెస్ వే పై ఈ ఏఐ వ్యవస్థను ప్రారంభించారు. దీంతో ఈ రహదారి దేశంలో తొలి ఏఐ ఆధారిత డిజిటల్ హైవేగా గుర్తింపు పొందింది. అయితే ఈ ప్రయత్నం విజయవంతం కావడంతో ఇప్పుడు తెలంగాణలోని నేషనల్ హైవేలకు ఈ వ్యవస్థను అమర్చాలని రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తం అవుతోంది.
ఈ డిజిటల్ రహదారులను ఏఐతో పాటుగా పోలీస్, రవాణాశాఖలతో సమన్వయం చేయనున్నారు. అలాగే భవిష్యత్తులో నిర్మించే జాతీయ రహదారులను రాష్ట్ర కమాండ్ కంట్రోల్ కేంద్రానికి అనుసంధానించనున్నారు. ఈ అత్యాధునిక టెక్నాలజీ కారణంగా జాతీయ రహదారులపై 14 రకాల ట్రాఫిక్ ఉల్లంఘనలను గుర్తించగలదు. అలాగే సీటు బెల్ట్ లేకపోవడం, ద్విచక్ర వాహనాలపై ముగ్గురు ప్రయాణించడం, అధిక వేగం.. ఇలా ప్రతి ట్రాఫిక్ ఉల్లంఘన రికార్డు అవుతుంది. ఏఐ స్మార్ట్ కెమెరాలు వాహనాల వివరాలను తక్షణమే ఎన్ ఐసీ ఈ- చలాన్ పోర్టల్, సంబంధిత పోలీసులకు పంపిస్తుంది. అంతేకాక ట్రాఫిక్ పర్యవేక్షణ, వీడియో రికార్డింగ్, వెహికల్ వేగం ట్రాకింగ్, అలెర్ట్ సైన్ బోర్డులు రోడ్ల పక్కన ఏర్పాటు చేయనున్నారు.

మారుతున్న టెక్నాలజీ ఆధారంగా రోడ్డు ప్రమాదాలను నివారించడమే కాకుండా.. ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు ఈ ఏఐ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. జాతీయ రహదారులపై నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న తరుణంలో నూతన సాంకేతికత ద్వారా ఈ ప్రమాదాలను నివారించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే డిజిటల్ హైవేల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేస్తోంది. రానున్న రోజుల్లో ఇతర రాష్ట్రాల్లోనూ ఇలాంటి సంస్కరణలే రానున్నాయి.












Click it and Unblock the Notifications