సరికొత్త అవతారంలో పోసాని..ఈసారి బీజేపీ నేతతో కలిసి
చిత్ర పరిశ్రమలో తనదైన డైలాగ్స్, విలక్షణ నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి మరోసారి మెగా ఫోన్ పట్టారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన సరికొత్త చిత్రం "ఆపరేషన్ అరుణారెడ్డి". కేవలం దర్శకత్వమే కాకుండా.. కథ, స్క్రీన్ప్లే, మాటలు, పాటలు, ఎడిటింగ్తో పాటు నిర్మాణ బాధ్యతలను కూడా పోసాని స్వయంగా చూసుకోవడం ఈ సినిమా ప్రత్యేకత. ఈ నెల 17న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్కు సిద్ధమవుతున్న నేపథ్యంలో, మంగళవారం సాయంత్రం హైదరాబాద్లో ఈ చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్ను ఘనంగా నిర్వహించారు.
నమ్మకాన్ని వ్యక్తం చేసిన పోసాని
ఈ సందర్భంగా పోసాని కృష్ణమురళి మాట్లాడుతూ సినిమాపై తనకున్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. రచయితగా, నటుడిగా, దర్శకుడిగా నా సుదీర్ఘ కెరీర్లో ఎన్నో సినిమాలు చేశాను. కానీ, నేను చేసిన అన్ని చిత్రాల్లోకెల్లా 'ఆపరేషన్ అరుణారెడ్డి' చిత్రానికి బెస్ట్ స్క్రీన్ప్లే ఇచ్చానని గర్వంగా చెప్పగలను. సినిమా ప్రారంభం నుండి ముగింపు వరకు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. ఇందులో ఎలాంటి అసభ్యత, బూతు సన్నివేశాలు ఉండవు. ఎంతో సిన్సియర్గా, కుటుంబమంతా కలిసి చూసేలా దీన్ని రూపొందించాను. నా మిత్రుడు శ్రీనివాస్ అందించిన సహకారం వల్లే సినిమా అనుకున్న సమయానికి ప్రేక్షకుల ముందుకు వస్తోందని అన్నారు. ఈ సినిమాలో బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కీలక పాత్రలో కనిపించనున్నారు.

స్వయంగా పాటలు రాసిన మహదేవ్
సంగీత దర్శకుడు మహదేవ్ ఏలేందర్ మాట్లాడుతూ..పోసాని ఎంతో పక్కా ప్లానింగ్తో, ఎన్నో వెర్షన్స్ రాసుకుని ఈ స్క్రిప్ట్ సిద్ధం చేశారు. ఆయనే స్వయంగా పాటలు కూడా రాయడం విశేషం. ఈ సినిమా పోసాని కెరీర్లో 2.ఓ వెర్షన్గా నిలిచిపోతుందని తెలిపారు. హీరోయిన్ హిందోళ చక్రవర్తి మాట్లాడుతూ.. సొసైటీని రిఫ్లెక్ట్ చేస్తూ, ఆలోచింపజేస్తూనే నవ్వించే అద్భుతమైన పాత్రలో నటించే అవకాశం రావడం సంతోషంగా ఉందన్నారు. అలాగే సెకండ్ లీడ్ కాజల్ శర్మ మాట్లాడుతూ, విడుదలయ్యాక ప్రతి ఒక్కరూ మాట్లాడుకునేలా ఈ సినిమా ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని, పాజిటివ్ మౌత్ టాక్తో దూసుకుపోతుందని ధీమా వ్యక్తం చేశారు. ఒక వైపు సమాజానికి అద్దం పడుతూ, మరోవైపు ఉత్కంఠభరితమైన స్క్రీన్ప్లేతో సాగనున్న ఈ "ఆపరేషన్ అరుణారెడ్డి" ప్రేక్షకులను ఏ స్థాయిలో మెప్పిస్తుందో తెలియాలంటే.. ఈ నెల 17న థియేటర్లలో చూడాల్సిందే














Click it and Unblock the Notifications