తెలంగాణ గ్రూప్-3 అభ్యర్థులకు అలర్ట్: దరఖాస్తుల్లో సవరణకు అవకాశం
హైదరాబాద్: తెలంగాణలో గ్రూప్-3 పరీక్ష దరఖాస్తుల్లో సవరణలకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) అవకాశం కల్పించింది. ఆగస్టు 16న ఉదయం 10 గంటల నుంచి 21వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులను ఎడిట్ చేసుకోవచ్చని టీఎస్పీఎస్సీ తెలిపింది.
తెలంగాణలో గ్రూప్-3 సర్వీసు ఉద్యోగాలకు గత డిసెంబర్ నెలలో టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. 26 ప్రభుత్వ విభాగాల్లో మొత్తం 1363 పోస్టులు నోటిఫికేషన్ ఇవ్వగా.. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 23 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించారు.

తెలంగాణ రాష్ట్రంలో తొలి గ్రూప్-3 పరీక్షకు మొత్తం 5,36,477 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. గ్రూప్-3 పరీక్షల షెడ్యూల్ను త్వరలోనే విడుదల చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో దరఖాస్తుల్లో ఎడిట్ చేసుకునేందుకు టీఎస్పీఎస్సీ అవకాశం కల్పించింది.
గ్రూప్-2 పరీక్షలు నవంబర్ నెలలోనే..
తెలంగాణలో గ్రూప్-2 పరీక్షల రీషెడ్యూల్ తేదీలను టీఎస్పీఎస్సీ ప్రకటించింది. ఈ పరీక్షలను నవంబర్ 2, 3 తేదీల్లో నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ నెలలోనే గ్రూప్-2 పరీక్షలు జరగాల్సి ఉన్నప్పటికీ అభ్యర్థుల ఆందోళనలతో ప్రభుత్వం వీటిని నవంబర్ నెలకు వాయిదా వేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ తాజాగా పరీక్ష తేదీలను ప్రకటించింది. ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనున్నాయి. పరీక్షలకు వారం రోజుల ముందు హాల్ టికెట్లను టీఎస్పీఎస్సీ అధికారిక వెబ్ సైట్ www.tspsc.gov.inలో అందుబాటులో ఉంచనున్నట్లు అధికారులు తెలిపారు.
అశోక్కు బెయిల్
టీఎస్పీఎస్సీ కార్యాలయం వద్ద ఆందోళన కేసులో అరెస్ట్ అయిన కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు అశోక్కు బెయిల్ మంజూరైంది. గ్రూప్-2 పరీక్ష వాయిదా వేయాలని అభ్యర్థులను రెచ్చగొట్టి టీఎస్పీఎస్సీ భవనం వద్ద ఆందోళన చేయించాడని ఆయణ్ని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
వాట్సాప్ తోపాటు పలు సోషల్ మీడియాల్లో టీఎస్పీఎస్సీ భవనం వద్దకు లక్ష మంది రావాలని అశోక్ పిలుపునిచ్చారని పోలీసులు తెలిపారు. ఈ మేరకు ఆందోళన జరిగిన రోజే అశోక్ను అరెస్ట్ చేసిన బేగంబజార్ పోలీసులు జైలుకు తరలించారు. తాజాగా, అశోక్ కు నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.












Click it and Unblock the Notifications