మోడీ ఏం చేస్తారు?
తాను 26వ తేదీన జరిగే పాలక మండలి సమావేశానికి హాజరవుతానని, అధ్యక్షత వహిస్తానని లలిత్ మోడీ చెప్పడంతో బిసిసిఐ పెద్దలు వేగంగా పావులు కదిపారు. ఐపియల్ ఫైనల్ ముగిసిన వెంటనే లలిత్ మోడీని సస్పెండ్ చేస్తూ బిసిసిఐ నిర్ణయం వెలువరించిది. మోడీపై బిసిసిఐ 22 ఆరోపణలు చేసింది. 34 పేజీల చార్జిషీట్ ను మోడీకి ఇ-మెయిల్ చేసింది. ఆర్థిక అక్రమాలతో నుంచి బిడ్డింగ్ ల రిగ్గింగ్, ప్రచ్ఛన్న వాటాలు, ప్రసార హక్కుల వ్యవహారాల్లో లంచాలు తీసుకోవడం వంటి ఆరోణలను బిసిసిఐ లలిత్ మోడీపై చేసింది. తాము ఇచ్చిన చార్జిషీట్ పై సమాధానం ఇవ్వడానికి మోడీకి 15 రోజుల గడువు ఇచ్చింది.
తాను అన్ని ఆరోపణలకు సమాధానం ఇస్తానని మోడీ ఐపియల్ ముగింపు కార్యక్రమంలో అన్నారు. దీన్ని బట్టి ఆయన అంత సులభంగా వెనక్కి తగ్గేట్లు లేరని అర్థమవుతోంది. ఈ స్థితిలో ఆయన భవిష్యత్తు కార్యక్రమం ఏమటనే ప్రశ్న తలెత్తుతోంది. బిసిసిఐ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆయన కోర్టుకు వెళ్లే అవకాశం ఉంది. అలాగే ఐపియల్ జట్ల యజమానుల మద్దతును కూడగట్టుకునేందుకు ప్రయత్నించవచ్చు. విజయ్ మాల్యా, షారూఖ్ ఖాన్, శిల్పా శెట్టి వంటి పలు ఫ్రాంచైజీల యజమానులు ఇప్పటికే లలిత్ మోడీకి మద్దతు ప్రకటించారు. ఈ స్థితిలో బిసిసిఐతో లలిత్ మోడీ యుద్ధం దీర్ఘకాలం కొనసాగవచ్చు.