ఐఎస్ఐఎస్: భారత్తోపాటు ప్రపంచానికీ ముప్పే
న్యూఢిల్లీ/బాగ్దాద్: పెచ్చుమీరుతున్న ఐఎస్ఐఎస్ ఉగ్రవాదం వల్ల భారతదేశంతోపాటు ఇతర ప్రపంచ దేశాలకు కూడా ముప్పు పొంచివుంది. ప్రస్తుతం ఇరాక్లో రెచ్చిపోతున్న ఉగ్రవాదులు ఆ దేశంలో శాంతిభద్రతలకు తీవ్ర భంగం కలిగిస్తున్నాయి. ఉగ్రవాదులు దాడుల్లో అనేకమంది సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రజల ప్రాణాలు, ఆస్తులకు రక్షణ లేకుండా పోతోంది. అంతేగాక ఉగ్రవాదులు బ్యాంకులలో ప్రజలు దాచుకున్న సొమ్మును కూడా దోచుకుపోతున్నారు.
ప్రస్తుత ఐఎస్ఐఎస్ఐ(ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాక్ అండ్ సిరియా) అనే ఈ ఉగ్రవాద సంస్థ 2006లో ఐఎస్ఐ(ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాక్) అనే పేరుతో ఆవిర్భవించింది. అనాటి నుంచి ఆ సంస్థ తమ కార్యకలాపాలను సాగిస్తోంది. ప్రజలను, దేశాలను భయభ్రాంతులకు గురి చేస్తోంది. ఇరాక్, సిరియా దేశాల్లో ఈ ఉగ్రవాద సంస్థ ఇటీవల దాడులను ముమ్మరం చేసింది. ఉగ్రవాద సంస్థ తమ కార్యకలాపాలను ఆసియా, ఆఫ్రికాలతోపాటు ఇతర ప్రపంచ దేశాల్లోనూ విస్తరించేందుకు వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది.
కాగా, ఉగ్రవాదులు ఇరాక్ ఉత్తర ప్రాంతంలో షియా తెగకు చెందిన ముస్లింలు అధిక సంఖ్యలో నివసించే కీలక పట్టణం తల్ అఫర్ను ఆధీనంలోకి తెచ్చుకునేందుకు ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య వారం రోజుల నుంచి భీకర పోరు జరుగుతోంది. దీంతో భయాందోళన చెందుతున్న ప్రజలు పెద్ద సంఖ్యలో ఇతర ప్రాంతాలకు వలస పోతున్నారు. ఈ సంక్షోభం గురించి చర్చించేందుకు ‘కీలక' సమావేశం నిర్వహించాలని అగ్రరాజ్యం అమెరికా, ఇరాక్ యోచిస్తున్నాయి.
యుద్ధంతో అట్టుడుకుతున్న సిరియా సరిహద్దును ఆనుకుని ఉన్న తల్ అఫర్లో ఉగ్రవాదులు గత వారం రోజుల నుంచి భీకర దాడులకు పాల్పడుతుండటంతో అమెరికా, ఆస్ట్రేలియా రాయబార కార్యాలయాలకు చెందిన కొంత మంది సిబ్బందిని ఖాళీ చేయించాల్సిని పరిస్థితి ఏర్పడింది. ఏకంగా రాజధానినే హస్తగతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న ఐఎస్ఐఎల్ (ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ లెవంట్) జిహాదీ గ్రూపు తీవ్రవాదులు ‘భయానకమైన' ఊచకోతకు పాల్పడటంతో పాటు ఇరాక్ సైనికులను భారీ సంఖ్యలో హత్య చేసినట్లు సమాచారం . దీన్ని అంతర్జాతీయ సమాజం తీవ్రంగా గర్హిస్తోంది.
జిహాద్ పేరుతో సాగుతున్న ఈ ఉగ్రవాద మారణకాండ ప్రపంచ దేశాలను దిగ్ర్భాంతికి గురిచేసింది. జిహాద్ ఉగ్రవాదం వల్ల ప్రపంచంలో అశాంతి, మారణకాండ నెలకొంటోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కాగా, భారతదేశంలోని ఉత్తర, పశ్చిమ ప్రాంతాలను కూడా ఉగ్రవాదులు లక్ష్యం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఉగ్రవాదం తాలిబన్ల కంటే ప్రమాదకరంగా ఉందని దేశాలు ఆందోళన చెందుతున్నాయి.
ఇటీవల పాకిస్థాన్లోని కరాచీ విమానాశ్రయం, ఇతర ప్రాంతాల్లో వరుసగా బాంబు దాడులకు, కాల్పులకు ఐఎస్ఐ ఉగ్రవాదులు తెగపడిన విషయం తెలిసిందే. ఈ దాడిలో అనేక మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. పాకిస్థాన్కు చెందిన ఈ ఉగ్రవాద సంస్థ తమ సొంత దేశ ప్రజలను కూడా వదలట్లేదు. ప్రపంచ వ్యాప్తంగా ఇస్లాం రాజ్యాన్ని ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో కొనసాగుతున్న ఉగ్రదాడులు సామాన్య ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచ దేశాలు ఉగ్రవాదులను మట్టుపెట్టేందుకు కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.