పాపికొండల యాత్ర...ఇకపై దేవీపట్నం నుంచి...స్టార్టింగ్ పాయింట్ మార్పు
తూర్పుగోదావరి: చుట్టూ గోదావరి గలగలలు...అంతటా ఆకు పచ్చని ప్రకృతి సోయగాలు...మధ్యలో సమున్నత పర్వత పంక్తులు...చల్ల చల్లని గాలులు...ముచ్చటైన వెదురు గుడిసెల్లో గడిపే రాత్రుళ్లు...సూర్యోదయమైనా...సూర్యాస్తమయమైనా...కొండల మధ్యనే...ఇవీ పాపికొండల యాత్రకు వెళ్లిన ప్రతి పర్యాటకుడికి ఎదురయ్యే అందమైన అనుభూతులు...అయితే ఇకపై పాపి కొండలకు యాత్రకు వెళ్లే సందర్శకులు గమనించాల్సిన అంశం ఒకటి ఉంది. అదేమిటంటే..ఈ పాపి కొండల సందర్శనకు బోట్లు బయలుదేరి వెళ్లే ప్రాంతాన్ని మార్చారు.
ఇప్పటి వరకు వివిధ ప్రాంతాల నుంచి పాపికొండల విహారయాత్రకు వచ్చే పర్యాటకులు తొలుత వాహనాలపై అంగుళూరు చేరుకుని అక్కడి నుంచి బోట్లపై బయలుదేరేవారు... కానీ బుధవారం నుంచి ఈ బోట్లు అన్నీ ఇంకా ఎగువన ఉండే దేవీపట్నం నుంచి మాత్రమే బయలుదేరి వెళతాయి. అంగుళూరు వద్ద గోదావరి నదిలో జరుగుతున్న పోలవరం ప్రాజెక్టు పనుల కారణంగా ఈ మార్పు చేశారు.
అధికారుల...అదేశాలు....
పోలవరం ప్రాజెక్టు పనుల్లో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా రామయ్యపేట నుంచి తూర్పుగోదావరి జిల్లాలోని అంగుళూరు వైపు గోదావరి మధ్యన అడ్డుకట్ట వేస్తున్నారు. దీంతో బోట్లు వెళ్లేందుకు మార్గం మూసుకుపోనుంది. దీంతో దిగువ ప్రాంతంలోని బోట్లు, లాంచీలను దేవీపట్నం వైపు వెంటనే తరలించాలని మంగళవారం సాయంత్రం పోలవరం ప్రాజెక్టు అధికారులు పర్యాటకశాఖ అధికారులు ఆదేశాలు జారీచేశారు.
ఇక అన్ని బోట్లు...అక్కడ నుంచే...
ఈ నేపథ్యంలో పాపి కొండల సందర్శనకు ఈ ప్రాంతం నుంచి బయలుదేరే 26 పర్యాటక బోట్లు, 8 లాంచీలను ఇక నుంచి ఎగువ ప్రాంతం దేవీపట్నం నుంచే నడపాలని నిర్ణయించారు. దీంతో పాపికొండలు ఇప్పటివరకు బయలుదేరి వెళ్లే ప్రాంతానికి...కొత్తగా దేవీపట్నంలోని స్టార్టింగ్ పాయింట్ కు మధ్య సుమారు 10 కిలోమీటర్ల దూరం ఉండటంతో సందర్శకులు ఇకపై బోట్లు ప్రారంభమయ్యే ప్రాంతం చేరుకోవడానికి అదనంగా 10 కిలోమీటర్ల దూరం ప్రయాణం చెయ్యాల్సి ఉంటుంది.
కరెక్ట్ ప్లేస్...ఇంకా నిర్ణయించలేదు...
అయితే వీటిని దేవీపట్నంలోని గోదావరి తీరంలో ఈ బోట్లను ఎక్కడ నిలపాలనే అంశంపై పర్యాటకశాఖ అధికారులు ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. బుధవారం వరకు బోట్లను పర్యాటకులను ఎక్కించుకోవడానికి ఎక్కడ వీలుంటే అక్కడ ఎక్కించుకునే విధంగా అనుమతించాలని, ఆ తరువాత మాత్రం ఒకే నిర్దేశిత ప్రాంతం సూచించనున్నట్లు తెలిసింది. ఈ విషయమై బోటు జూనియర్ సూపరింటెండెంట్ మాట్లాడుతూ...బుధవారం దేవీపట్నం నుంచి యాత్ర ప్రారంభించనున్న నేపథ్యంలో ఇబ్బందులు లేకుండా బోట్లు నిలపడానికి అనుకూలమైన ప్రాంతాన్నిఎంపిక చేస్తామని చెప్పారు.
కొన్ని ఇబ్బందులు...తప్పవు...
దీంతో సందర్శకులు పాపి కొండలకు వెళ్లే బోట్లు బయలుదేరి వెళ్లే పాంతానికి చేరుకునేందుకు సుమారు 10 కిలోమీటర్ల దూరం అదనంగా ప్రయాణించి దేవీపట్నం చేరుకోవాల్సి ఉంది. అయితే ఈ దారి ఇరుకు రహదారి కావడం...మధ్యలో దండంగి వాగుపై చిన్నపాటి వంతెనపై పెద్ద బస్సులు వెళ్లే పరిస్థితి లేకపోవడం...తదిదర సమస్యలతో పర్యాటకులు కొన్నిఇబ్బందులు ఎదుర్కోక తప్పదని భావిస్తున్నారు.