చంద్రబాబుకు రెండు కళ్లు
తాము తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామని, తెలంగాణ విషయంలో తమ వైఖరి మారలేదని రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్న తెలుగుదేశం నాయకుడు కె. ఎర్రంనాయుడు చెప్పారు. తెలంగాణకు కట్టుబడి ఉన్నామని అంటూనే సమైక్యాంధ్ర నినాదాన్ని తెలుగుదేశం మోయడం వెనక సీమాంధ్రలో తమ బలాన్ని కాపాడుకునే వ్యూహం మాత్రమే ఉందని చెబుతున్నారు. తెలంగాణ ఉద్యమం ద్వారా తెలంగాణలో, సమైక్యాంధ్ర నివాదంతో సీమాంధ్రలో తమ బలాన్ని కాపాడుకోవడం చంద్రబాబు వ్యూహంగా కనిపిస్తుంది.
రెండు రాష్ట్రాలు ఏర్పడితే చంద్రబాబు జాతీయ రాజకీయాలకు వెళ్తారని తెలుగుదేశం నాయకులు బాహాటంగానే చెబుతున్నారు. ఇటు తెలంగాణకో, అటు సీమాంధ్రకో ముఖ్యమంత్రి అయ్యే ఉద్దేశం ఆయనకు లేనట్లు కనిపిస్తుంది. రాష్ట్రం విడిపోతుందనే ఆయన గట్టిగా నమ్ముతున్నట్లు తెలుస్తోంది. సీమాంధ్రలో ఉద్యమాల ద్వారా కాంగ్రెసు, ప్రజారాజ్యం పార్టీలపై పైచేయి సాధించే ఉద్దేశంతో చంద్రబాబు ఉన్నారని అంటున్నారు. సమైక్యాంధ్ర నివాదంతో ఉద్యమాలు చేపట్టే పరిస్థితి దాటిపోయిందని కూడా ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే సమస్యల ప్రాతిపదికపై ముందుకు సాగాలని అనుకుంటున్నట్లు చెబుతున్నారు.