కెసిఆర్ సైలెన్స్ వెనక శ్రీకృష్ణ మంత్రం?
ఉద్యమ తీవ్రత తగ్గించాలంటే టిఆర్ఎస్ను బుజ్జగించడమే ముఖ్యమైన అంశమని 8వ అధ్యాయంలో పేర్కొన్న దిశలో కేంద్రం పావులు కదుపుతున్నట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగానే కెసిఆర్ స్తబ్ధగా ఉన్నట్లుగా తెలుస్తోంది. శ్రీకృష్ణ కమిటీ రిపోర్టు వచ్చిన తర్వాత శీతాకాలం పార్లమెంటు సమావేశాలలో తెలంగాణ బిల్లు పెట్టకుంటే ఉద్యమం తీవ్రతరం చేస్తామన్న కెసిఆర్ ఢిల్లీలో సమావేశాలు జరుగుతుంటే ఆయన మాత్రం రాష్ట్రంలో తిష్ట వేశారు. పార్లమెంటులో కేవలం రెండు రోజులు తెలంగాణపై తీర్మానం ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేసి ఆ తర్వాత హైదరాబాద్ వచ్చారు. రెండు రోజులు మినహా ఆయన పార్లమెంటులో తెలంగాణ అంశం లేవనెత్తింది లేదు. దీంతో అందరిలోనూ అనుమానాలు బయటపడుతున్నాయి.
అంతేకాకుండా ఇటీవల జరిగిన ఎంఎస్ఓల సమావేశంలో కెసిఆర్ విలీనం ప్రస్తావన తీసుకువచ్చినట్లు వార్తలు వచ్చాయి. తెలంగాణ అంశంపై కూడా ఆయన మాట్లాడాల్సి వచ్చినప్పుడు కేవలం టిడిపినే లక్ష్యంగా చేసుకొని మాట్లాడుతున్నారు. కానీ కాంగ్రెసు పార్టీని మాత్రం ఏమీ అనడం లేదు. పార్లమెంటులో దుమ్ము దులుపుతానని చెప్పి కెసిఆర్ ఇప్పుడు నోరు మెదపకపోవడం వెనుక 8వ అధ్యాయాన్ని అనుసరించి కేంద్రం ఆదేశాలు ఉన్నట్లుగా పలువురు భావిస్తున్నారు. కెసిఆర్ ఆధ్వర్యంలో క్రమంగా ఉద్యమ తీవ్రతను తగ్గించేసి, ఆ తర్వాత టిఆర్ఎస్ పార్టీని కాంగ్రెసులో విలీనం చేసుకోవడమే లక్ష్యంగా కేంద్రం ముందుకు వెళుతున్నట్లుగా తెలుస్తోంది.
శ్రీకృష్ణ అందించిన 8వ అధ్యాయంలో తెలంగాణ వస్తే నక్సలిజం పెరుగుతుందని, మతమౌడ్యం పెరుగుతుందని తదితర వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తోంది. వీటితో పాటు తెలంగాణలో ఉద్యమాన్ని తగ్గించడానికి సూచనలు చేసినట్టుగా తెలుస్తోంది. ఉద్యమాన్ని అణిచి వేయడానికి పలువురిని ముందస్తుగా అరెస్టు చేయడం, ఉద్యమాలు చెలరేగకుండా ఉండటానికి భారీగా పోలీసులను మోహరించడంతో పాటు తెలంగాణలో ముఖ్యమైన టిఆర్ఎస్ను మొదట బుజ్జగించే ప్రయత్నాలు చేయాలని చెప్పినట్టుగా తెలుస్తోంది. టిఆర్ఎస్ను బుజ్జగిస్తే ఉద్యమం తీవ్రత తగ్గే అవకాశాలు ఉన్నాయని ఆ రిపోర్టులో పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా పార్టీలో ఉన్న నేతలను కూడా ఏకత్రాటిపైకి తీసుకు రావాల్సిన ఆవశ్యకతను ప్రస్తావించినట్లుగా తెలుస్తోంది.
8వ అధ్యాయం సూచన మేరకే కేంద్రం వాటిని క్రమంగా అమలు పరుస్తున్నట్టుగా తెలుస్తోంది. తమ పార్టీ నేతలను ఏకత్రాటిపైకి తేవడంలో భాగంగా మార్చి 25, 26వ తేదీలలో కాంగ్రెసు పార్టీ తెలంగాణ, సీమాంధ్ర ఇరు పార్టీల పార్లమెంటు సభ్యులతో కేంద్ర మంత్రితో సమావేశం ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది.ఇరు పార్టీల ఎంపీలను సమావేశ పరిచి వారిని సముదాయించే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఉద్యమ తీవ్రతను తగ్గించడానికి కూడా ముందస్తుగా అరెస్టులతో పాటు భారీగా పోలీసులను మోహరించే దిశలో ప్రభుత్వం వెళుతున్నది.
8వ అధ్యాయంలో మీడియాపై చేసిన వ్యాఖ్యలను కూడా అధిష్టానం అనుసరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. పలు పత్రికలలో తెలంగాణ రిపోర్టర్ల కారణంగా ఉద్యమం తీవ్రత పెరుగుతోందని చెప్పింది. దీనిపై కూడా కేంద్రం దృష్టి సారించే అవకాశాలు ఉన్నాయి. మీడియాపై ఆంక్షలు విధించే దిశలో ప్రయత్నాలు చేయడానికి కేంద్రం యోచిస్తున్నట్టుగా తెలిస్తోంది.