కిరణ్ కుమార్ రెడ్డి ఒంటెత్తు పోకడ
ఇటీవలి ఎమ్మెల్సీ ఎన్నికల నుంచి ప్రస్తుతం జరుగుతున్న కడప లోకసభ, పులివెందుల శాసనసభ ఉప ఎన్నికల వరకు ఆయన డిఎస్ మాటను వినడం లేదనే విమర్శలు వస్తున్నాయి. స్థానిక సంస్థల కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎందరు వ్యతిరేకించినా గంగా భవానీ, రుద్రరాజు పద్మరాజు వంటివారిని అభ్యర్థులుగా ఎంపిక చేశారు. అలాగే, శాసనసభ్యుల కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా కిరణ్ కుమార్ రెడ్డి తన ఇష్టప్రకారంగానే వ్యవహరించారు. దానివల్లనే మహ్మద్ జానీ ఓడిపోయే పరిస్థితి వచ్చిందని అంటున్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన అసమ్మతి శాసనసభ్యుడు, మాజీ మంత్రి రామచంద్రా రెడ్డిని పిలిపించి మాట్లాడాలని డిఎస్ చేసిన సూచనను కిరణ్ కుమార్ రెడ్డి పట్టించుకోలేదని అంటారు. అదే తరహాలో అనంతపురం జిల్లా సీనియర్ శానససభ్యుడు జెసి దివాకర్ రెడ్డితో కూడా మాట్లాడాల్సి ఉందని ఆయన చెప్పారట. వారితో మాట్లాడడానికి ముఖ్యమంత్రి నిరాకరించడం వల్లనే వారు మొండిగా వ్యవహరించారని, దాంతో కాంగ్రెసు అభ్యర్థులు ఓడిపోయారని అంటారు.
కడప లోకసభ సీటుకు మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డిని అభ్యర్థిగా ఎంపిక చేయాలని మొదటి నుంచీ డిఎస్ ప్రతిపాదిస్తూ వచ్చారు. అయితే, ఆ ప్రతిపాదనను ఖాతరు చేయకుండా కందుల రాజమోహన్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని కిరణ్ కుమార్ రెడ్డి ప్రయత్నాలు చేశారు. ఆయన అంగీకరించకపోవడంతో ఆయన సోదరుడు కందుల శివానంద రెడ్డిని పోటీకి దించాలని కూడా ప్రయత్నించారు. అయితే కందుల సోదరులు పోటీకి అంగీకరించలేదు. అభ్యర్థులు కరువై, తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన నాయకుడికి పార్టీ టికెట్ ఇచ్చారనే విమర్శ వస్తుందని, అందువల్ల కందుల రాజమోహన్ రెడ్డికి టికెట్ ఇవ్వకూడదని డిఎస్ వాదించారని చెబుతారు.
తన మాట వినకపోవడంతో తీవ్ర అసంతృప్తికి గురైన డిఎస్ కాంగ్రెసు అధిష్టానానికి కిరణ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. పరిస్థితిని ఆకళింపు చేసుకున్న అధిష్టానం డిఎల్ రవీంద్రా రెడ్డి పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది. పైగా, ఏ విషయంపై కూడా డిఎస్తో మాట్లాడడానికి కిరణ్ కుమార్ రెడ్డి ఇష్టపడడం లేదని అంటున్నారు. దీంతో డిఎస్ ఎప్పటికప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి వద్దకు వచ్చి మాట్లాడుతున్నట్లు చెబుతున్నారు. ఏమైనా, కిరణ్ కుమార్ రెడ్డి వ్యవహార శైలిపై లోలోపల తీవ్ర అసంతృప్తి రగులుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.