అఖిలప్రియతో తంటాలు: చంద్రబాబు తీరు వల్లనే...
చంద్రబాబు కాలయాపన వల్లనే నంద్యాల సీటు కేటాయింపు సంక్లిష్టంగా మారిందని అంటున్నారు. శిల్పా పార్టీ మారక ముందే చర్యలు తీసుకుని ఉంటే బాగుండేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
కర్నూలు: నంద్యాల రాజకీయం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడికి తీవ్రమైన చిక్కులను తెచ్చి పెడుతోంది. భూమా నాగిరెడ్డి మరణం తర్వాత ఆయన కూతురు అఖిల ప్రియ మంత్రి పదవిని చేపట్టారు.
మంత్రి పదవి చేపట్టిన తర్వాత అఖిల ప్రియ వ్యవహరిస్తున్న తీరు కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఇబ్బందులను కల్పిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా నంద్యాల ఉప ఎన్నికల్లో సీటును కేటాయించే విషయంలో రాజుకున్న అగ్గి ఇంకా చల్లారడం లేదు.
ఆ వ్యవహారంలోనే శిల్పా మోహన్ రెడ్డి టిడిపిని వీడి వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. మరో సీనియర్ నేత, భూమా నాగిరెడ్డికి అత్యంత సన్నిహితుడైన మరో నేత తిరుగుబాటు జెండా ఎగురేశారు. ఈ వ్యవహారాలను చక్కదిద్దడంలో చంద్రబాబు చేసిన జాప్యం వల్ల నష్టం పూడ్చరాని విధంగా తయారవుతోందనే అభిప్రాయం బలపడుతోంది.
ఆకుల కాలాక...
నంద్యాల రాజకీయాలపై పార్టీ అధినేత చంద్రబాబు వ్యవహారం చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లుగా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నంద్యాల నియోజకవర్గం పార్టీ ఇన్చార్జి శిల్పా మోహనరెడ్డి వైసిపిలో చేరిన తర్వాత గానీ చంద్రబాబులో కదలిక రాలేదని అంటున్నారు. ఇప్పుడు ఆయన ముందుకు వచ్చి సమస్యను పరిష్కరించాలని చూస్తున్నారని, ఇప్పటికే పరిస్థితి చేయి దాటిపోయిందని అంటున్నారు.
గత మూడు నెలలుగా...
నంద్యాల ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపికపై గత మూడు నెలల నుంచి వివాదం చెలరేగుతోంది. తొలుత శిల్పా మోహన్ రెడ్డి, అఖిలప్రియ వర్గాలతో ఆయన చర్చలు జరిపారు. అయినా సమస్య పరిష్కారం కాలేదు. ఫలితంగా శిల్పా మోహన్ రెడ్డి పార్టీ మారారు. సమస్య పరిష్కారంలో చంద్రబాబు విఫలం కావడం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందని అంటున్నారు.
భూమా మరణించినప్పటి నుంచీ...
భూమా నాగిరెడ్డి మరణించిన నాటి నుంచి శిల్పా మోహనరెడ్డి తనకు ఉప ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించాలని డిమాండ్ చేయడాన్నిపార్టీ వర్గాలు తప్పు పడుతున్నాయి. మరణించిన వ్యక్తి కుటుంబం నుంచి మరొకరికి ఉప ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించడాన్ని అన్ని రాజకీయ పార్టీలు సంప్రదాయంగా పాటిస్తున్న విషయం ఆయన గుర్తుంచుకోవాల్సిందని అంటున్నారు. కానీ, ఆ సంప్రదాయాన్ని పక్కన పెట్టాలని ఆయన కోరడం వల్ల పరిస్థితి విషమించిందని అంటున్నారు.
అప్పుడే చెప్పి ఉంటే...
శిల్పా మోహన్ రెడ్డి డిమాండ్పై చంద్రబాబు మొదట్లోనే తన అభిప్రాయాన్ని స్పష్టం చేసి ఉంటే పరిస్థితి ఇంత దాకా వచ్చేది కాదని అంటున్నారు. భూమా మృతితో ఖాళీ అయిన నంద్యాల స్థానంలో వారి కుటుంబం నుంచే అభ్యర్థిని నిలపాలని చంద్రబాబు భావిస్తే ఆ విషయాన్ని శిల్పాకు స్పష్టం చేసి ఉంటే దానివల్ల నష్టం తక్కువగా ఉండేదని అంటున్నారు.ఒక వేళ భూమా కుటుంబంలో ఇవ్వడానికి సమస్య ఉంటే ఆ విషయం మంత్రి అఖిలప్రియకు చెప్పి నచ్చజెప్పాల్సి ఉండిందని అంటున్నారు. ఈ రెండింట్లో చంద్రబాబు ఏదీ చేయకపోవడమే పరిస్థితి తీవ్రరూపం దూల్చడానికి కారణమని అంటున్నారు.
చంద్రబాబు కాలయాపన వల్లనే...
సమస్యను ఆదిలోనే పరిష్కరించకుండా అభ్యర్థిని తాను నిర్ణయిస్తానని వేచి ఉండాలంటూ కాలయాపన చేయడం వల్ల శిల్పా మోహన్ రెడ్డి పార్టీ మారారని అంటున్నారు. కర్నూలు జిల్లాలోని ఏ నియోజకవర్గంలోనైనా నాయకుల మధ్య విబేధాలు పరిష్కరించడం చంద్రబాబుకు సాధ్యమయ్యేది కాదని, ఎవరినో ఒకరికి పార్టీ బాధ్యతలు అప్పగించి ఆ విషయాన్ని ఇతర నేతలకు వెల్లడించి పార్టీలో క్రమశిక్షణతో లేని వారిని బయటకు పంపితే ఉన్న నాయకులు పార్టీ కోసం నిబద్ధతతో పనిచేస్తారని అంటున్నారు.
రెండు వర్గాలను ప్రోత్సహిస్తే...
రెండు వర్గాలను పెంచి పోషిస్తే ఏదో ఒకనాడు పార్టీని చిక్కుల్లో పడేసి ఎవరో ఒకరు మరో దారి చూసుకుంటారని అంటున్నారు. దానివల్ల పార్టీకి నష్టం జరుగుతుందని అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా చొరవ తీసుకుని విబేధాలు ఉన్న నియోజకవర్గాల నేతలతో చర్చించి సమస్యను పరిష్కరించాలని అంటున్నారు.