సామాన్యుల సొంతింటి కల ఇక ఖరీదే..
గత కొన్ని నెలలుగా సిమెంట్ ధరలు కాస్త ఉపశమనం కలిగించినా, మళ్లీ పాతపద్ధతినే అనుసరిస్తున్నాయి. కొన్నాళ్లుగా మళ్లీ సిమెంట్ ధరలు పెరగడం ప్రారంభించాయి. భూముల ధరలు, ఇసుక, సిమెంట్, ఉక్కు, ఇతర నిర్మాణాల వ్యయాలు భారీగా పెరిగాయి. తాజాగా ఆ జాబితాలో సిమెంట్ కూడా చేరింది. సిమెంట్ ధరలు త్వరలో భారీగా పెరగనున్నాయి. దీంతో ఇక సామాన్యుల సొంతింటి కల మరింత ఖరీదుగా మారనుంది. ప్రస్తుతం ఉన్న సిమెంట్ ధరలను సిమెంట్ తయారీ కంపెనీలు 12 నుంచి 13 శాతానికి పెంచనున్నాయి. దీంతో దేశంలో 50 కిలోల సిమెంట్ బస్తా ధర 382 రూపాయలకు చేరుకుంది. ఈశాన్య ప్రాంతాల్లో సిమెంట్ బస్తా ధర 326 రూపాయల నుంచి 400 రూపాయలకి పెరిగింది.
పండగ సీజన్లలో : ప్రస్తుత పండుగల సీజన్లోను, ఆ తర్వాత కూడా ఇదే సీన్ రిపీట్ అవుతుందని అంచనా. ఫలితంగా ఇంటి నిర్మాణ ఖర్చు పెరుగుతూనే ఉంటుందని భావిస్తున్నారు విశ్లేషకులు. సెప్టెంబర్ నెలలో సిమెంట్ సగటు రిటైల్ రేటు ఒక నెల క్రితంతో (QoQ) పోలిస్తే, అంటే ఆగస్టుతో పోలిస్తే 4 శాతం పెరిగింది. త్రైమాసికం ప్రాతిపదికన చూస్తే... అంతకుముందు అంటే 2023 ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఉన్న సగటు ధర కంటే సెప్టెంబర్ త్రైమాసికంలో సగటు ధర 0.5 శాతం నుంచి 1 శాతం పెరిగింది.

5 వేల కోట్ల రూపాయలు : ఇకపోతే.. గత నెలలో అదానీ గ్రూప్కు చెందిన అంబుజా సిమెంట్ కంపెనీ, ప్రముఖ సిమెంట్ కంపెనీ సంఘీ ఇండస్ట్రీస్ను కొనుగోలు చేసింది. ఈ డీల్ విలువ సుమారు 5 వేల కోట్ల రూపాయలు. ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ ప్రకారం, అంబుజా సిమెంట్స్ సంఘీ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (SIL)లో 56.74 శాతం వాటాను ప్రస్తుత ప్రమోటర్లు రవి సంఘీ, వారి కుటుంబం నుండి కొనుగోలు చేయనుంది. ఈ డీల్ తర్వాత అంబుజా సిమెంట్ షేర్లు 4.5 శాతం, సంఘీ ఇండస్ట్రీస్ షేర్లు 5 శాతం పెరిగాయి.
రుతుపవనాల తిరోగమనమే..దీనికి కారణం : వాస్తవానికి, గత మూడు సంవత్సరాల్లో, జూన్ త్రైమాసికంతో పోలిస్తే సెప్టెంబర్ త్రైమాసికంలో రేట్లు తగ్గాయి, ఒక్కో బ్యాగ్ రేటు సగటున 14 రూపాయలు పడిపోయింది. ఈ సంవత్సరం సీన్ రివర్స్ అయింది, ధర పెరిగింది. సాధారణంగా వర్షాకాలంలో సిమెంట్ ధరలకు గిరాకీ తగ్గి ధరలు తగ్గుముఖం పడతాయి. అయితే రుతుపవనాల తిరోగమనమే సిమెంట్ ధరలు పెరగడానికి కారణమని మార్కెట్ నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా ముడిసరుకు ధరలు, తయారీ వ్యయాలు పెరగడం వల్ల కూడా సిమెంట్ ధరలు పెరిగినట్లుగా తెలుస్తోంది.

ఒక్కో సిమెంట్ బస్తా.. 50 నుంచి 55రూపాయలు : కొన్ని నివేదికల ప్రకారం.. మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే తూర్పు భారతదేశంలో సిమెంట్ ధరలు ఆకాశాన్నంటాయి. తూర్పు భారతదేశంలో, ఆగస్టు నెలాఖరులో సిమెంట్ బస్తా మీద ఉన్న MRP సెప్టెంబర్ చివరి నాటికి పూర్తిగా మారిపోయింది, ఒక్కో బస్తాకు 50 రూపాయల నుంచి 55 రూపాయల వరకు పెరిగింది. మిగిలిన ప్రాంతాల్లో సిమెంట్ బస్తా రిటైల్ ప్రైస్ కాస్త తక్కువగా, ఒక్కో బస్తాకు 20 రూపాయల వరకు పెరిగింది. వచ్చే ఏడాదిలో ఎన్నికల నేపథ్యంలో, నిర్మాణాల మీద ప్రభుత్వం దృష్టి పెట్టడం, రుతుపవనాల ప్రభావం పెద్దగా లేకపోవడం వల్ల సిమెంట్ రంగానికి డిమాండ్ కొనసాగుతోంది. దీనిని బట్టి, ఇంటి నిర్మాణ ఖర్చు ఇప్పట్లో తగ్గే అవకాశం లేదు. సిమెంట్ రిటైల్ రేట్లు పెరగడానికి కారణం ఇదేనేమో..












Click it and Unblock the Notifications