రేవంత్ మల్కాజి'కిరి': పవన్, జెపిలకు చెక్
హైదరాబాద్: మల్కాజిగిరి లోకసభ స్థానంపై తెలుగుదేశం పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి కిరికికి ప్రారంభించారు. ఆ స్థానం నుంచి తానే పోటీ చేస్తానని ఆయన శనివారం ప్రకటించారు. ఈ సీటుపై సీమాంద్ర నాయకులు పలువురు కన్నేశారు. లోకసత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణతో పాటు జనసేన నేత పవన్ కళ్యాణ్ కూడా ఇదే సీటుపై కన్నేసినట్లు చెబుతున్నారు.
తెలుగుదేశం, బిజెపి, జనసేనల మధ్య పొత్తు కుదిరే అవకాశం ఉంది. దీంతో జయప్రకాష్ నారాయణ ఆ సీటునుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఆ విషయాన్ని జెపి బహిరంగంగానే చెప్పారు. పవన్ కళ్యాణ్ కూడా ఆ సీటు నుంచి పోటీ చేసి తెలంగాణలో పాగా వేయాలని చూస్తున్నట్లు చెబుతున్నారు. పొత్తు కారణంగా ఆ సీటు వారిద్దరికీ దక్కకుండా రేవంత్ రెడ్డి ముందుకు వచ్చినట్లు చెబుతున్నారు.

నిజానికి, రేవంత్ రెడ్డి చాలా కాలంగా ఆ సీటు నుంచి పోటీ చేస్తానని పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడితో చెబుతూ వస్తున్నారు. తెలుగుదేశం తెలంగాణ ప్రాంత నాయకులు ఎర్రబెల్లి దయాకర్ రావు, మోత్కుపల్లి నర్సింహులు కూడా ఆ సీటును ఆశిస్తున్నారు. ఈ స్థితిలో రేవంత్ రెడ్డి పట్టు సాధించి, తన పంతాన్ని నెగ్గించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.
తెలంగాణ సాధించుకుంది స్థానికులకు అవకాశం కోసమేనని, స్థానికేతరలూ సీమాంధ్రులూ మల్కాజిగిరి నుంచి పోటీ చేయాలని అనుకోవడం సరి కాదని రేవంత్ రెడ్డి అన్నారు. తద్వారా ఆయన జెపి, పవన్ కళ్యాణ్లకు ఎసరు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా, ఎమ్మెల్సీ నాగేశ్వర్ ఆమ్ ఆద్మీ, సిపిఎం తదితర పార్టీల మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కాంగ్రెసు నుంచి కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ పోటీ చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. వైయస్సార్ కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) విషయాలు తెలియడం లేదు.












Click it and Unblock the Notifications