ప్రసంగాలు వద్దు: కేంద్ర మంత్రికి చేదు అనుభవం
హైదరాబాద్: కేంద్ర జౌళి శాఖ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్కు హైదరాబాదులో శుక్రవారంనాడు చేదు అనుభవం ఎదురైంది. పత్తి కనీస మద్దతు ధర రూ. 4,100 ఏమాత్రం సరిపోదని సదస్సులో పాల్గొన్న రైతులు కేంద్రమంత్రి ముందు నిరసన వ్యక్తం చేశారు. తాము ఐదు గంటలు ప్రయాణించి వచ్చింది కేవలం ప్రసంగాలు వినడానికి కాదని రైతులు అన్నారు.
మద్దతు ధరను ఐదు వేలకు పెంచడంతోపాటు, పంటల బీమాను నిబంధనల పేరుతో ఇబ్బందులు పెట్టకుండా అమలు చేస్తేనే ఆశించిన ప్రయోజనం ఉంటుందని లేకపోతే ఆత్మహత్యలు తప్ప మరో దారి లేదని రైతులు ఒక్కసారిగా మంత్రుల ముందు ఆందోళన వ్యక్తం చేశారు. పత్తి విత్తనాలు, పురుగుల మందులు రెండూ నాసిరకం వల్ల ఆశించిన ప్రయోజనం ఉండడం లేదని ఫిర్యాదు చేశారు.
ఎంతో కొంత పండితే తేమ ఎక్కువగా ఉందని, రంగు మారిందని, నాణ్యత లేదని పంటను తిప్పి పంపుతున్నారు ధ్వజమెత్తారు. అదే పత్తిని ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేసి దొడ్డిదారిన సిసిఐకి అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారని అన్నారు. ఇలా రెండు విధాలుగా తాము నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మద్దతు ధర, కొనుగోళ్లు వంటి అంశాలను పరిష్కరించేందుకు మంత్రులు, అధికారులతో కూడిన సమన్వయ కమిటీని నియమించాలని కోరారు.

నేషనల్ ఫైబర్ పాలసీని అమల్లోకి తెచ్చి పత్తి వినియోగాన్ని పెంచితే డిమాండ్ పెరుగుతుందని మరో రైతు సూచించారు. పంట చేతికి వచ్చే వరకు అయ్యే ఖర్చుకు, మద్దతు ధరకు పొంతన లేదని ఆందోళన వ్యక్తం చేశారు.
కాగా, పత్తిత్తి కనీస మద్దతు ధరను రూ.5 వేలకు పెంచాలన్న రైతుల డిమాండ్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళతానని కేంద్ర జౌళిశాఖ సహాయ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ హామీ ఇచ్చారు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) ద్వారా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు రైతులనుంచి పత్తి కొనుగోలు చేయడం తప్ప కనీస మద్దతు ధర పెంపు తన చేతిలో లేదని అన్నారు.
శుక్రవారం నాడిక్కడ సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ సైనె్సస్ (సిఇఎస్ఎస్)లో జరిగిన ‘తెలంగాణ పత్తి రైతుల సమ్మేళనం- పరస్పర అవగాహన' సదస్సులో కేంద్రమంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. తెలంగాణతోపాటు పలు రాష్ట్రాల్లో జరుగుతున్న రైతు ఆత్మహత్యలు చాలా బాధాకరమని అన్నారు.












Click it and Unblock the Notifications