చంద్రబాబు ఝలక్!.. వైసీపీ సక్సెస్!.. అసలు నిజమేంటి?
సీఎం చంద్రబాబుతో వైసీపీ ఎమ్మెల్యేల భేటీ ఆసక్తికర చర్చకు దారితీసింది. భేటీ ద్వారా వైసీపీ ఎమ్మెల్యేలు ప్రభుత్వ తీరును ఎండగట్టారని కొంతమంది అభిప్రాయపడుతుంటే..
విజయవాడ : అధికారంతో సంబంధం లేకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత. ఈ విషయంలో సొంత పార్టీనా..? ప్రతిపక్ష పార్టీనా? అన్న భేషజాలకు పోకుండా.. ప్రజలను దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంటుంది.
అయితే మారుతున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో.. ప్రతిపక్షాల ఉనికిని పూర్తిగా తుడిచిపెట్టాయలన్న రీతిలో అధికార రాజకీయాల తీరు ఉంటూ వస్తుంది. దీంతో కేవలం తమ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాలకు మాత్రమే నిధులు విడుదల చేస్తూ.. ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాలకు నిధులు విడుదల చేయడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ముఖ్యంగా ఏపీ పాలిటిక్స్ లో ఈ తంతు ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీకి ప్రతికూలంగా మారింది. ఎమ్మెల్యేలను పక్కనబెట్టి.. అధికార పార్టీ ఇంఛార్జీలకే నియోజకవర్గ బాధ్యతలను అప్పజెప్పుతున్నారని వైసీపీ నేతలు చాలా కాలంగా మొత్తుకుంటున్నారు. ఎలాగైనా సరే ఈ పరంపరకు ఫుల్ స్టాప్ పెట్టాలనే యోచనలో భాగంగా.. మొత్తానికి సీఎం చంద్రబాబు నాయుడిని కలిసి పరిస్థితి గురించి వివరించారు.

ఇక ఇక్కడినుంచి అసలు సంగతి మొదలైంది. భేటీ తర్వాత బాబు వైసీపీ నేతలకు ఝలక్ ఇచ్చారని కొందరు అభిప్రాయపడితే.. ప్రభుత్వ తీరును ఎండగట్టడంలో వైసీపీ నేతలు విజయం సాధించారని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. టీడీపీ అనుకూల-ప్రతికూల మీడియా మధ్య ఈ విషయం బాగా నానుతోంది. ఈ సంగతి పక్కనబెడితే.. భేటీలో భాగంగా నియోజకవర్గ నిధుల గురించి చంద్రబాబు వద్ద వైసీపీ నేతలు ప్రస్తావించారు.
టీడీపీ ఇంఛార్జీలే నియోజకవర్గ ఎమ్మెల్యేల్లా వ్యవహరిస్తున్న పరిస్థితిని ఈ సందర్బంగా వారు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారని చెబుతున్నారు. నియోజకవర్గ నిధులను తమ పేర కేటాయించాలని సత్వరం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. దీనికి సీఎం స్పందించిన తీరు వైసీపీ నేతలను తీవ్ర అసహనానికి గురిచేసినట్టుగా తెలుస్తోంది. మీకు నియోజకవర్గ అభివృద్ధి ముఖ్యమా? లేక మీ పేరనే అభివృద్ధి పనులు జరగడం ముఖ్యమా? అంటూ చంద్రబాబు ప్రశ్నించారట.

అంటే, తమ పార్టీ నేతల విన్నపానికి చంద్రబాబు సానుకూలంగా లేరన్న విషయాన్ని ఇలా పరోక్షంగా చెప్పారని ప్రతిపక్ష పార్టీలో చర్చ జరుగుతోంది. దీంతో చంద్రబాబు నిరంకుశంగా స్పందించారని వైసీపీ నేతలు ఆరోపిస్తుంటే.. వైసీపీని సీఎం భలే ఇరుకున పెట్టారని టీడీపీ నేతలు మాట్లాడుకుంటున్నారు.
అయితే సీఎం వైఖరిని నిరసిస్తూ.. వాస్తవ పరిస్థితులను జనాలకు అర్థమయ్యేలా చేసేందుకు వెలగపూడి పాదయాత్రను నిర్వహించారు వైసీపీ నేతలు. పాదయాత్రకు మంచి స్పందనే లభించిందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ తీరును జనం ముందు ఎండగట్టడంలో ఈ చర్య ద్వారా వైసీపీ కొంతమేర సఫలమైందని చెప్పుకుంటున్నారు. ఏదేమైనా పార్టీల మధ్య పాలిటిక్స్ కు జనం బలికాకుడదు అన్నది అంతిమంగా ప్రజాస్వామ్య ప్రభుత్వాల బాధ్యత అని చెప్పుకోవాలి.












Click it and Unblock the Notifications