"పెళ్లిళ్లకొచ్చింది కష్టం.. చదివింపులకు దెబ్బ, దెబ్బకు వాయిదా"
ముంబై : ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చినట్టు.. పెద్ద నోట్ల రద్దు కాస్త పెళ్లిళ్ల తంతుకు సంకటంగా మారింది. పెళ్లి ఏర్పాట్లకు భారీ మొత్తంలో డబ్బు చేతిలో ఉండాల్సి రావడం.. ప్రస్తుతం చేతిలో ఉన్న నోట్లు చెల్లే పరిస్థితి లేకపోవడంతో.. చాలా వివాహాలు అర్థాంతరంగా రద్దయిపోతున్నాయి.
వీటన్నింటికి మించి.. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో పెళ్లిళ్లు గనుక చేసుకుంటే.. కట్నాల చదివింపులకు దెబ్బ పడుతుందనేది కూడా.. వివాహాల రద్దుకు మరో బలమైన కారణం. కొత్త నోట్లు అందరికి అందుబాటులోకి రావాలంటే మరిన్ని రోజులు పట్టక తప్పదు. ఒకవేళ ఇప్పుడే గనుక పెళ్లికి సిద్దమైపోతే.. కట్న కానుకల చదివింపులకు నోచుకోన్నట్టే.. అన్న అభిప్రాయం పెళ్లిళ్లు జరగాల్సిన కుటుంబాల్లో వ్యక్తమవుతోంది.
చదివింపులకు దెబ్బ పడుతుందన్న కారణంతో.. ముంబైకి చెందిన ఓ మార్వాడీ కుటుంబం ఏకంగా పెళ్లినే రద్దు చేసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. రీటా గుప్తా అనే యువతి స్నేహితురాలి వివాహం వచ్చే వారంలో జరగాల్సి ఉంది. అయితే తాజా పరిస్థితుల రీత్యా పెళ్లి వాయిదా పడింది. కారణం.. మార్వాడీ పెళ్లిళ్లు నాలుగు రోజుల పాటు జరుగుతాయి. ఈ నాలుగురోజుల తంతులో 18సార్లు కట్న కానుకల చదివింపులుంటాయి.

ప్రతీ ఒక్కరు ఎంత లేదన్నా.. రూ.51వేలు కట్నంగా చదివించడం మార్వాడీ పెళ్లిళ్లలో కామన్. కానీ పెద్ద నగదు నోట్ల రద్దు నేపథ్యంలో.. కొత్త నోట్లు ఇంకా అందరి చేతికి రాని పరిస్థితి. ఇలాంటి తరుణంలో పెళ్లంటే.. అన్నేసి కట్నకానుకలను పోగొట్టుకున్నట్టే లెక్క. అందుకే పెళ్లిళ్లను తాత్కాలికంగా వాయిదా వేసుకోవడమే ఉత్తమం అన్న నిర్ణయానికి వస్తున్నాయి చాలా కుటుంబాలు.
ముంబైలోని జింఖానాలో ప్రతిష్ట్మాత్మకంగా జరగాల్సిన ఓ వివాహం.. పెద్ద నోట్ల రద్దు కారణంగా అర్దారంతరంగా ఆగిపోయిందని స్థానిక వెడ్డింగ్ ప్లానర్ ఒకరు అభిప్రాయపడ్డారు. పెళ్లి ఏర్పాట్లకయ్యే ఖర్చును ఎలా చెల్లించాలన్న భయంతోనే వివాహాలను వాయిదా వేసుకుంటున్నారని ఎంటర్ టెయిన్ మెంట్ అండ్ వెడ్డింగ్స్ డైరెక్టర్ ఆదిత్యా మౌత్వానీ తెలిపారు. అయితే విదేశీ క్లయింట్లు ఎక్కువగా ఉన్నందువల్ల తమ సంస్థకు వచ్చిన నష్టమేమి లేదని ఆయన పేర్కొన్నారు. చిన్న, మధ్యతరగతి కుటుంబాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశముందని తెలియజేశారు.












Click it and Unblock the Notifications