బల్దియా మీదే అన్ని పార్టీల కన్ను
హైదరాబాద్: హైదరాబాద్ నగర పాలక సంస్థ ఎన్నికలపైనే ప్రధాన పార్టీలు కన్నుపెట్టినట్లు కనిపిస్తోంది. మంగళవారం పోలింగ్ జరుగనున్న నేపథ్యంలో ఆయా పార్టీల నేతలు చేసిన ప్రకటనలు ఈవిషయాన్ని తెలియజేస్తున్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుతో సహా కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ(సిఎల్పి) నేత డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి కూడా బల్దియా ఎన్నికలను దృష్టిలోపెట్టుకునే సోమవారం ప్రకటనలు చేసినట్లు కనిపిస్తోంది.
గెలుపు మాదే: చంద్రబాబు
హైదరాబాద్ నగర పాలక సంస్థ ఎన్నికల్లో గెలుపు తమదేనని ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ధీమా వ్యక్తం చేశారు. బల్దియా ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలవకపోతే రాజకీయాలకేఅర్థం లేదని ఆయన అన్నారు. తాము నగరం అభివృద్ధికి చేపట్టిన కార్యక్రమాలే తమ పార్టీని గెలిపిస్తాయని ఆయన అన్నారు.
అభివృద్ధిపై దృష్టి పెట్టని కాంగ్రెస్, మజ్లీస్లను ఓటర్లు తిరస్కరిస్తారని ఆయన అన్నారు. హైదరాబాద్లో కాంగ్రెస్ పోటీలోనే లేదని ఆయన అన్నారు. మజ్లీస్కు అభివృద్ధిపై ఆసక్తి లేదని ఆయనవిమర్శించారు.
దేశం అధికార దుర్వినియోగం: కాంగ్రెస్
మినీ మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందనిఅరోపిస్తూ కాంగ్రెస్ ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసింది.స్వయంగా మంత్రులు ఓటర్లకు మద్యం, డబ్బులు పంపిణీ చేస్తున్నారని కాంగ్రెస్ ఆరోపించింది.
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో సామాన్యుల జీవన స్థితిగతులు మెరుగపడ్డాయా, లేదా అనే ఆలోచన చేసి ఆత్మప్రబోధం మేరకు ఎన్నికల్లో ఓటు చేయాలని కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ(సిఎల్పి) నేత డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి ఓటర్లకువిజ్ఞప్తి చేశారు. ఎన్నికలు ముగిసిన వెంటనే ప్రభుత్వం కరెంట్ ఛార్జీలు పెంచుతుందని తెలియజేసే వ్యంగ్య చిత్రాన్ని ఆయన విడుదల చేశారు. ఎన్నికల్లో ప్రభుత్వం పోలీసు యంత్రాంగాన్ని వాడుకోజూస్తోందని ఆయనవిమర్శించారు.
దేశం రిగ్గింగ్ ముఠా: టిఆర్ఎస్
రిగ్గింగ్ ముఠాలను తెలుగుదేశం పార్టీ నగరంలో దించిందని తెలంగాణా రాష్ట్ర సమితి అధ్యక్షుడుకె. చంద్రశేఖర్ రావు ఆరోపించారు. ఈ ముఠాలు హైదరాబాద్లోనికాచిగూడా, హబ్సిగూడా, తదితర ప్రాంతాల్లోని హోటళ్లలో దిగాయని ఆయన అన్నారు. ఈ ముఠాలపై సోమవారం రాత్రి తాము దాడులు చేస్తామని ఆయన హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీ ఓటర్లకు మద్యం, డబ్బులు పంపిణీ చేస్తూ ఓటర్లను ప్రలోభ పెడుతోందని ఆయనవిమర్శించారు.
తెలుగుదేశం మేయర్ అభ్యర్థి తీగల కృష్ణారెడ్డిపైసైఫాబాద్ పోలీసు స్టేషన్లో అక్రమ భూఆక్రమణ కేసు నమోదయిందని ఆయనఅంటూ తెలుగుదేశం మేయర్ అభ్యర్థిపైనే కేసు వుండగా అక్రమ భూకబ్జాదారుల భరతం పడుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనడం విడ్డూరంగా వుందని వ్యాఖ్యానించారు. దానికి తోడు ముఖ్యమంత్రి నివాసమున్న ప్రాంతంలోనే పట్టణ గరిష్ట భూపరిమితి చట్టం ఉల్లంఘన జరిగిందని ఆయన ఆరోపించారు.
ఎంపిలైనా, ఎమ్మెల్యేలైనా.....
చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే పార్లమెంటు సభ్యులను, శాసనసభ్యులను కూడా ఉపేక్షించబోమని హైదరాబాద్ పోలీసు కమిషనర్పేర్వారం రాములు అన్నారు. వారి వాహనాలను జప్తు చేసి, వేలం వేస్తామని ఆయన చెప్పారు. ముందు జాగ్రత్త చర్యగా 1200 మందిని అదుపులోకి తీసుకున్నట్లు ఆయన తెలిపారు. హైదరాబాద్ పౌరుల కానివారు పోలింగ్ ఏజెంట్లుగా వుంటే వారిపై చర్యలు తీసుకుంటామని కూడా ఆయన చెప్పారు.
పోలింగ్ సందర్భంగా అవాంఛనీయ సంఘటనలేవీ జరగకుండా గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. హైదరాబాద్లో 367 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకంగా గుర్తించి అదనపు బందోబస్తు ఏర్పాట్లు చేశారు. 16 వేల మంది సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేసినట్లు పోలీసు కమిషనర్ చెప్పారు. వేలి ముద్రలను పరిశీలించి రిగ్గింగ్కు పాల్పడినవారిపై చర్యలు తీసుకుంటామని కూడా ఆయన తెలిపారు.
నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినవారిపై చర్యలు తీసుకుంటామని ఎన్నికల కమిషన్ కార్యదర్శి గార్గ్ చెప్పారు. ఎన్నికల పరిశీలనకు 25 మందితో కూడా అధికార బృందంతో పాటు 75 మందితో కూడిన అనధికార బృందాన్ని కమిషన్ నియమించింది. వేలి ముద్రల కంప్యూటరీకరణను కూడా చేపట్టింది.












Click it and Unblock the Notifications
