డోర్ ఓపెన్ కాలేదు.. పాకిస్తాన్ కలలకు మోదీ సర్కార్ చెక్?
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కీలకంగా మారుతున్న బ్రిక్స్ కూటమిలో సభ్యత్వం పొందేందుకు పాకిస్తాన్ చేసిన ప్రయత్నాలు ఇప్పటికీ ఫలించలేదు. 2023లోనే పాకిస్తాన్ ఈ కూటమిలో చేరేందుకు అధికారికంగా దరఖాస్తు చేసుకున్నప్పటికీ.. భారత్ నిరాకరించడంతో ఆ దేశ సభ్యత్వ ప్రతిపాదన ముందుకు సాగడం లేదు. బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికాలతో కూడిన ఈ కూటమిలో గతేడాది ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, యూఏఈ వంటి దేశాలు చేరి 'బ్రిక్స్ ప్లస్'గా రూపాంతరం చెందినప్పటికీ.. పాకిస్తాన్కు మాత్రం తలుపులు మూసుకుపోయే ఉన్నాయి.
తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్తాన్, తన ఆర్థిక సవాళ్లను అధిగమించడానికి, నిధుల సమీకరణలో ప్రపంచ బ్యాంక్, ఐఎంఎఫ్లపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడానికి బ్రిక్స్ సభ్యత్వాన్ని కీలకమైనదిగా భావిస్తోంది. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు కేవలం 3.70 శాతంగా నమోదు కాగా.. బ్రిక్స్ ఆధ్వర్యంలో పనిచేసే న్యూడెవలప్మెంట్ బ్యాంకులో 580 మిలియన్ డాలర్ల విలువైన వాటాలను కొనుగోలు చేయడం ద్వారా ప్రత్యామ్నాయ ఆర్థిక మార్గాలన అన్వేషిస్తోంది. ప్రపంచ జనాభాలో 49 శాతం, కొనుగోలు ఆధారిత ప్రపంచ జీడీపీలో 40 శాతానికి పైగా ప్రాతినిధ్యం వహిస్తున్న బ్రిక్స్ కూటమిలో చేరడం ద్వారా గ్లోబల్ సౌత్ వేదికగా కీలక పాత్ర పోషించవచ్చని పాకిస్తాన్ ఆశిస్తోంది.

పాకిస్తాన్ దరఖాస్తుకు చైనా, రష్యాలు మద్దతు ఇస్తున్నప్పటికీ.. బ్రిక్స్ నియమాల ప్రకారం కొత్త దేశాలకు సభ్యత్వం ఇవ్వాలంటే కూటమిలోని సభ్యదేశాలన్నీ ఏకగ్రీవంగా అంగీకరించాల్సి ఉంటుంది. భారత్ వద్ద ఉన్న వీట్ పవర్ కారణంగా పాకిస్తాన్ సభ్యత్వ ప్రతిపాదనకు ఆమోదం లభించడం లేదు. మరోవైపు బ్రిక్స్ దేశాలతో భారత్ వాణిజ్య సంబంధాలు వేగంగా విస్తరిస్తున్నాయి. బ్రిక్స్ దేశాలకు భారత్ చేసే ఎగుమతులు 48.8 శాతం మేర పెరిగి.. 64.3 బిలియన్ డాలర్ల నుంచి 95.7 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. రష్యాలోని పాకిస్తాన్ రాయబారితో పాటు విదేశాంగ శాఖ ప్రతినిధులు సభ్యత్వ మద్దతు కోసం నిరంతం ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ.. భారత్ అభ్యంతరం దృష్ట్యా పాకిస్తాన్ అభ్యర్థన పెండింగ్లోనే ఉండిపోయింది.












Click it and Unblock the Notifications
