హైదరాబాదుకు అబూ సలేం తరలింపు
హైదరాబాద్: అండర్ వరల్డ్ డాన్ అబూ సలేంను సిబిఐ అధికారులు హైదరాబాదుకు తీసుకొచ్చారు. ముంబై నుంచి నేరుగా ఆయనను సిబిఐ అధికారులు చర్లపల్లి జైలుకు తరలించారు. అయితే కోర్టు అనుమతి లేకుండా ఆయనను జైలులోకి అనుమతించబోమని జైలు అధికారులు చెప్పారు. దీంతో సిబిఐ అధికారులు న్యాయనిపుణులతో చర్చించి అబూ సలేంను నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు. అనంతరం చర్లపల్లి జైలుకు తరలించారు.
నకిలీ పాసుపోర్టుల కేసుల అబూసలేంతో పాటు ఆయన ప్రియురాలు, సినీనటి మోనికా బేడీ నకిలీ పాసుపోర్టులు తీసుకున్నట్లు ఆరోపణలున్నాయి. వీరిద్దరే కాకుండా అబూ సలేం భార్య పేరు మీద కూడా నకిలీ పాసుపోర్టు తీసుకున్నారని అరోపణ ఉంది. నకిలీ పాసుపోర్టులపై పారిపోయిన అబూ సలేంను, మోనికా బేడీని 2001 ఏప్రిల్ 19వ తేదీన పోర్చుగల్ లో అరెస్టు చేశారు. 2002లో వారిని భారతదేశానికి తీసుకొచ్చారు. అయితే మోనికా బేడీని మాత్రం ముంబై నుంచి హైదరాబాద్ తీసుకొచ్చారు. భద్రతా కారణాల రీత్యా అబూ సలేంను తీసుకు రాలేదు.
నకిలీ పాసుపోర్టు కేసును విడగొట్టి మోనికా బేడీపై కేసు విచారణ జరిపారు. ఆమెకు కోర్టు ఐదేళ్ల కారాగార శిక్ష విధించింది. కింది కోర్టు తీర్పును మోనికా బేడీ హైకోర్టులో సవాల్ చేసింది. ఆమెకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆమె జైలు నుంచి విడుదలైంది. ఇప్పుడు హైదరాబాదులో అబూ సలేంపై ఉన్న కేసు విచారణ జరగనుంది.












Click it and Unblock the Notifications