చెన్నైలో దాసరి ప్రభు ప్రత్యక్షం
చెన్నై: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరులోని ఒక లాడ్జీ నుంచి అపహరణకు గురైన కేంద్ర మంత్రి దాసరి నారాయణరావు కుమారుడు దాసరి ప్రభు చెన్నైలో ప్రత్యక్షమయ్యారు. తన భార్య సుశీలనే తనను కిడ్నాప్ చేయించిందని దాసరి ప్రభు చెబుతున్నారు. తన బంధువులతో సుశీల తనను కిడ్నాప్ చేయించిందని ఆయన ఒక ప్రైవేట్ టీవీ చానెల్ ప్రతినిధితో అన్నారు. సుశీలకు తనపై కన్నా తన ఆస్తి మీదనే ప్రేమ ఎక్కువ అని, ఆమె తన ఆస్తిపై కన్ను వేసిందని ఆయన ఆరోపిస్తున్నారు. తన కిడ్నాప్ తో తన తల్లిదండ్రులకు ఏ విధమైన సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. ఆరేళ్లుగా తాను సుశీలతో నరకం అనుభవిస్తున్నానని, త్వరలో విడాకులకు దరఖాస్తు చేసుకుంటానని ఆయన చెప్పారు. తన రక్షణ కోసం ఆయన కోర్టులో పిటిషన్ వేశారు.
తన బావకు బాగా లేదని తనను చెన్నై తీసుకొచ్చారని, ఆ తర్వాత వేలూరుకు, వేలూరు నుంచి చిత్తూరుకు తీసుకొచ్చారని, చిత్తూరులోని లాడ్జిలో ఉంచారని ఆయన చెప్పారు. చిత్తూరు లాడ్జిలో సుశీల తనకు బాగా తాగించి తన బంధువులతో కిడ్నాప్ చేయించిందని ఆయన ఆరోపించారు. తనను ఒక రహస్య ప్రదేశంలో ఉంచారని, అక్కడ్నుంచి తప్పించుకుని బస్సులో చెన్నై చేరుకున్నానని ప్రభు వివరించారు. తనను శారీరకంగా హింసించలేదని, తన వద్ద ఉన్న నగలు, డబ్బులు తీసుకున్నారని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications