కొత్త ప్రధాన కార్యదర్శి రఘోత్తమరావు
హైదరాబాద్: ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఎఎస్ అధికారి రఘోత్తమరావు నియమితులు కానున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన భూపరిపాలన శాఖ కమీషనర్ గా ఉన్నారు. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి హరినారాయణ ఈ నెల 29వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో రఘోత్తమరావు నియమితులు కానున్నారు. రఘోత్తమ రావు పదవీ కాలం రెండు నెలల కాలం మాత్రమే ఉంది. ఈ రెండు నెలల కాలం ఆయనను కొనసాగించి వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తమకు అనుకూలంగా ఉండే ఉన్నతాధికారిని ప్రధాన కార్యదర్శిగా నియమించే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఇదే సమయంలో ఐఎఎస్ అధికారుల బదిలీకి కూడా ప్రభుత్వం సన్నాహాలు చేసినట్లు తెలుస్తోంది. దాదాపు 30 మంది ఐఎఎస్ అధికారులను బదిలీ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగా 8 జిల్లాల కలెక్టర్లను మారుస్తున్నట్లు సమాచారం. ఇద్దరిని వేరే జిల్లాలకు బదిలీ చేస్తుండగా మరో ఆరు జిల్లాలకు కొత్తవారిని కలెక్టర్లుగా నియమించనున్నట్లు సమాచారం. శ్రీకాకుళం, కృష్ణా, నెల్లూరు, చిత్తూరు, మెదక్, వరంగల్, కరీంనగర్, గుంటూరు జిల్లాల కలెక్టర్లను మార్చనున్నట్లు సమాచారం. దేవాదాయ, మున్సిపల్, సాధారణ పరిపాలనా శాఖల ఉన్నతాధికారులను బదిలీ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందుకు సంబంధించి బుధవారం సాయంత్రం ఉత్తర్వులు వెలువడే అవకాశాలున్నాయి.












Click it and Unblock the Notifications