విజయశాంతిపై రోజా రుసరుసలు
విశాఖపట్నం: హైదరాబాదులోని వికలాంగుల దీక్షా శిబిరంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడిపై వాగ్యుద్ధానికి దిగిన తల్లి తెలంగాణ వ్యవస్థాపకురాలు, సినీ నటి విజయశాంతిపై తెలుగు మహిళ అధ్యక్షురాలు, సినీ నటి రోజా రుసరుసలాడారు. ప్రజల కోసం ఎటువంటి కార్యక్రమాలు చేయని విజయశాంతి తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ప్రజాసేవ చేసిన చంద్రబాబును విమర్శించడం ఏమిటని ఆమె బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. చంద్రబాబును విజయశాంతి విమర్శించడం హాస్యాస్పదమని ఆమె అన్నారు. విజయశాంతి వంటివారి గురించి మాట్లాడటం కూడా సమయం వృధా అని ఆమె వ్యాఖ్యానించారు.
అయేషా హత్య కేసులో పోలీసు గురించి హోంమంత్రి కె. జానారెడ్డి చేసిన ప్రకటనను ఆమె తప్పు పట్టారు. జానారెడ్డి ప్రకటన పోలీసులను అవమానించేదిగా ఉందని ఆమె విమర్శించారు. అయేషా హత్య కేసులో మంత్రి కోనేరు రంగారావు బంధువుల పాత్ర ఉంది కాబట్టే కేసును తప్పు దోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆమె అన్నారు. పోలీసులకు స్వేచ్ఛ ఇస్తే అసలు నిందితులను పట్టుకుంటారని ఆమె అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications